జగన్ కోరి తెచ్చిన మనిషికి అద్దె కూడా ఇవ్వలేదా?

ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్ సర్కారుకు ప్రతి రోజూ ఏదో ఒక వివాదం లేనిదే పొద్దు పోయేలా లేదు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం గత ఆరు నెలల్లో ఎన్ని మలుపులు తిరిగింది.. దీని చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగాయి అన్నది తెలిసిందే.

మధ్యలో ఆర్డినెన్స్ తెచ్చి మరీ రమేష్ కుమార్‌పై వేటు వేయించిన జగన్ సర్కారు.. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆయనకు మంచి ప్రాధాన్యం కూడా ఇచ్చారు.

ఐతే తర్వాత ఆయన సైడ్ అయిపోయారు. ఈలోపు రమేష్ కుమార్ కోర్టులో పోరాడి మళ్లీ తన పదవిలో వచ్చి కూర్చున్నారు. దీంతో జస్టిస్ కనగరాజ్ విషయంలో ఏం చేయాలో పాలుపోలేదు ఏపీ ప్రభుత్వానికి. ఆయన్ని విధుల నుంచి రిలీవ్ చేయించి సొంత రాష్ట్రానికి పంపించేశారు. ఐతే ఆయన విజయవాడలో అద్దెకు ఉన్న ఇంటికి ఆరు నెలల వ్యవధిలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదట.

నెలకు రూ.1,11,800 చొప్పున అద్దెతో బెంజ్ సర్కిల్‌లోని రవీంద్రనాథ్ అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్లో జస్టిస్ కనగరాజ్ నివాసం ఉన్నారు. ఆరు నెలలకు కలిపి రూ.7 లక్షల దాకా ఆయన అద్దె చెల్లించాల్సి ఉందట. అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కనగరాజ్ చెన్నైకి వెళ్లిపోయారు. అధికారులెవరూ బాధ్యత తీసుకుని అద్దె చెల్లించలేదు.

తాజాగా ఆ ఫ్లాట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్‌ను తీసుకెళ్లేందుకు సిబ్బంది రాగా.. యజమాని రవీంద్రనాథ్ అందుకు ససేమిరా అన్నారు. తనకు చెల్లించాల్సిన అద్దె బకాయిలు చెల్లిస్తేనే ఫర్నిచర్ తీయనిస్తానని పట్టుబట్టారు. దీంతో పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు. తమకు మొత్తం ఆరు నెలలుగా అద్దె కింద రూ.7 లక్షల వరకు ఇవ్వాల్సి ఉండగా.. అధికారులెవరూ స్పందించడం లేదని వాపోయారు.

తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, సాధారణ ప్రజలమని.. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం సరి కాదని అన్నారు. దీనిపై అధికారులను అడిగితే కోర్టులో చూసుకుంటామని అంటున్నారని.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.