లాక్ డౌన్ 2.0 ఏం చేద్దాం? జగన్ కు షా ఫోన్

కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 దేశం మొత్తం లాక్ డౌన్ విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు పీకేందుకు స్వీయ గృహనిర్బంధం ఒక్కటే మార్గమని మోడీ ఇచ్చిన పిలుపునకు దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్దతు తెలిపాయి.

ఏప్రిల్ 14 తర్వాత కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఏప్రిల్ 14 నాటికి పరిస్థితులు చక్కబడకపోవడంతో మే3 వరకు లాక్ డౌన్ 2.0 విధించాలని ప్రధాని మరోసారి పిలుపునిచ్చారు. తాజాగా లాక్ డౌన్ 2.0 గడవు సమీపిస్తుండడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు, ఎత్తివేతలపై చర్చ మొదలైంది.

ఈ క్రమంలోనే లాక్ డౌన్ 2.0 కు ముందు అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయలు తీసుకున్నట్లుగానే…మరోసారి అభిప్రాయ సేకరణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్‌ 2.0 పరిణామాలు, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యుహంపై జగన్‌తో షా చర్చించారు.

ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను షాకు జగన్ వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి 10 లక్షల మందికి 1147 పరీక్షలు నిర్వహించామని సీఎం జగన్‌ వెల్లడించారు.

ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని సీఎం చెప్పారు. ఏప్రిల్‌ 20వ తేదీ తర్వాత ఇచ్చిన సడలింపుల ప్రభావంపైనా కూడా షా, జగన్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రతి 10లక్షల మందికి 1147 టెస్టులు చేస్తున్నారు. అయితే, ఆ పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

కోవిడ్‌–19 నివారణ చర్యలతో పాటు, వైరస్‌ వ్యాప్తిని నియంత్రణపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, లాక్ డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయాలని జగన్‌ ఆదేశించారు. రెడ్‌ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని…అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జగన్ అన్నారు. శ్రీకాకుళంలో 3 కేసులు నమోదు కావడంపై జగన్ ఆరా తీశారు. కట్టుదిట్టంగా కేసులు నమోదైన ప్రాంతాన్ని లాక్ డౌన్ చేసి జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించాలని సూచించారు.