జాబ్ మార్కెట్ పై షాకింగ్ సర్వే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఎంత దారుణ పరిస్థితి నెలకుందన్న విషయం తెలిసిందే. దేశీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటమే కాదు.. జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. మ్యాన్ పవర్ గ్రూపు ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ సర్వే ఒకటి వెల్లడైంది. ఇందులో పేర్కొన్న వివరాలు షాకింగ్ గా మారాయి.

కరోనా నేపథ్యంలో దేశీయంగా ఉద్యోగ నియామకాల సెంటిమెంట్ దశాబ్దన్నర పరిస్థితికి పడిపోయినట్లు చెబుతున్నారు. రానున్న మూడు నెలల్లో అపాయింట్ మెంట్లు ఇవ్వాలనుకున్న ఆలోచనలో ఉన్న కంపెనీలు చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని 813 కంపెనీల్ని సర్వే చేశారు.

వారు చెప్పిన వివరాల ఆధారంగా సర్వే రిపోర్టును సిద్ధం చేశారు. దీని ప్రకారం రానున్న మూడు నెలల్లో జాబ్ లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న కంపెనీలు కేవలం మూడు శాతమేనని తేలింది.

ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (అక్టోబరు – డిసెంబరు మధ్య కాలాన్ని)లో ఉద్యోగుల సంఖ్య యథాతధ స్థితి ఉంటుందని 54 శాతం కంపెనీలు చెప్పగా.. రిక్రూట్ మెంట్ ఉండే అవకాశం మూడు శాతం కంపెనీలే వెల్లడించాయి. ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఏడు శాతం కంపెనీలు పేర్కొన్నాయి.

ఈ సర్వే సంస్థ గడిచిన పదిహేనేళ్లుగా జాబ్ మార్కెట్ మీద తరచూ అధ్యయనాల్ని చేస్తుంటుంది. తాము సర్వేలు ప్రారంభించిన తర్వాత రిక్రూట్ మెంట్ సెంటిమెంట్ ఇంత బలహీనంగా ఉన్నది ఇదేనని చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాజాగా హైరింగ్ సెంటిమెంట్ పెద్ద కంపెనీలు.. మధ్య తరహా కంపెనీల కంటే కూడా చిన్న కంపెనీల్లోనే ఎక్కువగా ఉందంటున్నారు.

నియామకాలు గతంలో మాదిరి ఉండాలంటే కనీసం తొమ్మిది నెలల సమయం పట్టే వీలుందన్న విషయాన్ని 44 శాతం కంపెనీలు చెప్పినట్లు సర్వే రిపోర్టులో పేర్కొన్నారు. అదే సమయంలో.. 42 శాతం కంపెనీలు పూర్వ పరిస్థితికి ఎప్పటికి చేరుకుంటుందో తాము అంచనా వేయలేకపోతున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. ఏదైనా కంపెనీలో పని చేసే వారిని తాత్కాలికంగా సెలవులపై పంపిన వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా చెబుతున్నారు.