బిగ్‍బాస్‍ 4లో అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ఈ సీజన్‍ బిగ్‍బాస్‍ హౌస్‍లోకి ఎంటరయిన వాళ్ల గురించి చాలా ఫన్నీ మీమ్స్ వచ్చాయి. ‘ఎవరు మమ్మీ వీళ్లంతా’ అనే అలీ మీమ్‍, ‘ఎవర్రా మీరు?’ అనే సోనూ సూద్‍ మీమ్‍ చాలా పాపులర్‍ అయ్యాయి. హౌస్‍లోకి వెళ్లిన వాళ్లలో చాలా మంది ఎవరో కూడా ఆడియన్స్కి తెలియకపోవడంతో ఈ మీమ్స్ ఇన్‍స్టంట్‍గా కనక్ట్ అయ్యాయి. ఒక తెలిసిన ముఖాన్ని త్వరగా ఇంట్లోకి ప్రవేశ పెట్టాలని బిగ్‍బాస్‍ క్రియేటివ్‍ టీమ్‍ డిసైడ్‍ అయింది. జబర్దస్త్ షోతో పాపులర్‍ అయిన అవినాష్‍ వచ్చే ఆదివారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్‍ గట్టిగా వినిపిస్తోంది. షో మొదలు కావడానికి ముందే పదహారు రోజుల క్వారంటైన్‍లోకి వెళ్లాలని బిగ్‍బాస్‍ చెప్పగా అవినాష్‍ వారం రోజులు లేట్‍గా క్వారంటైన్‍లోకి వెళ్లాడట. అందుకే అతని ఎంట్రీ ఒక వారం ఆలస్యంగా జరుగుతుందన్నమాట.

హౌస్‍లో వున్న వాళ్లలో వినోదం పండించడం కంటే డ్రామా పండించడానికి చూస్తున్నారు. అవినాష్‍లాంటి కమెడియన్‍ వెళితే కాస్త ఆట, పాట పెరుగుతాయేమో. విశేషం ఏమిటంటే ఇంతవరకు పధ్నాలుగు మంది మాత్రమే హౌస్‍లోకి వెళ్లగా, ఇద్దరు సీక్రెట్‍ రూమ్‍లోనే వున్నారు. అయితే వాళ్లను సీక్రెట్‍గా వుంచిన సంగతి ఇంట్లోని మిగతా సభ్యులు కనిపెట్టేసారు. ఈ దాచిపెట్టిన వాళ్లను అయినా ఎవరైనా కొంచెం పాపులర్‍ అయిన వాళ్లను పెట్టి వుంటే బాగుండేదిగా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.