డ్రగ్స్ టెస్టుకు రెడీ…ప్రూవ్ చేస్తే ముంబై వదిలేస్తా:కంగనా

Kangana
Kangana Ranaut

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ కోణం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుశాంత్ ప్రియురాలు రియాను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, బాలీవుడ్ లో డ్రగ్స్ నీళ్లలా పారుతుందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఆ డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పుతానని, కానీ, తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపై కంగనా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ముంబై పోలీసులకు కంగనా చాలెంజ్ విసిరింది. తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగానీ, డ్రగ్ సప్లయర్స్ తో లింకులున్నట్టుగానీ తేలితే శాశ్వతంగా ముంబై విడిచి వెళ్లిపోతానని కంగనా చాలెంజ్ చేసింది. తనకు డ్రగ్స్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు చెక్ చేసుకోవచ్చని చెప్పింది. విచారణ కోసం తాను ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేసింది.

కంగనా రనౌత్ పై ఆమె మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ 2016లో చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టాయి. 2016లో ఓ పార్టీ సందర్భంగా కొకైన్ తీసుకోవాలని కంగనా తనను బలవంతపెట్టిందని,కంగనాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అధ్యయన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతే కాదు, కొకైన్ తీసుకోనందుకు తనతో కంగనా చాలాసేపు గొడవపడిందని అధ్యయన్ అన్నాడు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ప్రభుత్వానికి సమర్పించిన ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు….ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా అన్న అంశంపై విచారణకు ఆదేశించామని, ముంబై పోలీసులు విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఈ క్రమంలోనే తాను టెస్టులకు రెడీ అని, ఒకవేళ తాను ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నట్లుగానీ, డ్రగ్ డీలర్లతో కాంటాక్ట్స్ ఉన్నట్లుగానీ తేలితే ముంబై విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని కంగనా చాలెంజ్ చేసింది.