హ్యాపీ న్యూస్.. రైళ్లు పెరుగుతున్నాయ్

India Trains

లాక్ డౌన్ ష‌ర‌తుల‌న్నీ ఎత్తేశారు. అన్ని వ్యాపారాలూ న‌డుస్తున్నాయి. జ‌నాలు ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి తిరిగేస్తున్నారు. ఐతే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాత్రం రాక‌పోక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. బ‌స్సుల‌ను న‌డిపే విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతోంది.

ఆ వ్య‌వ‌హారం ఎంత‌కీ తేల‌ట్లేదు. రైళ్లు చూస్తే చాలా త‌క్కువ సంఖ్య‌లో న‌డుస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు సొంత వాహ‌నాల మీద ఆధార‌ప‌డుతున్నారు. లేదంటే భారీ రేట్లు పెట్టి ప్రైవేటు వాహ‌నాల్లో వెళ్లాల్సి వ‌స్తోంది. ప్ర‌జార‌వాణా పూర్తి స్థాయిలో ఎప్పుడు పునరుద్ధ‌రిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర రైల్వే శాఖ ఒక తీపికబురు చెప్పింది.

దేశ‌వ్యాప్తంగా రైళ్ల సంఖ్య‌ను పెంచ‌బోతున్నారు. భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి కొత్త‌గా 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. 10 నుంచి వీటిక‌కి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారం ప్ర‌క‌టించారు.

ఇందులో కొన్ని రైళ్లు ఏపీ తెలంగాణ ప‌రిధిలో రానున్నాయి. ఇప్ప‌టికే ఉన్న‌, కొత్త‌గా రాబోయే రైళ్ల‌లో వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదే మార్గంలో క్లోన్ ట్రైన్ల‌ను న‌డ‌ప‌బోతున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా కొత్త‌ రైళ్లను అందుబాటులో ఉంచుతామని కూడా ఆయ‌న చెప్పారు.

బ‌స్సుల స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో కానీ.. ఈ లోపు రైళ్ల సంఖ్య పెంచుతుండ‌టం శుభ‌వార్తే. హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం మార్గాల్లో డిమాండుకు త‌గ్గ‌ట్లు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.