విద్యుత్ కు నగదు బదిలీ… రైతుల్లో ఎన్నో భయాలు

ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలుకాబోతోన్న ‘ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీ’ పథకం ఇపుడు ఏపీలో చర్చనీయాంశమైంది. రైతులకు గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్ అందిస్తానని జగన్ సర్కార్ చెబుతోంది.

ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, కనెక్షన్ ఉన్నవారి స్మార్ట్ మీటర్లు బిగించి వారి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం కరెంటు బిల్లుకు సరిపడా డబ్బులు చెల్లిస్తుందని చెబుతోంది.

రైతులు ఒక్క రూపాయి కూడా కట్టే పనిలేదని, తామిచ్చే డబ్బుతో కరెంటు బిల్లు కడితే చాలని ప్రభుత్వం అంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే…పాత పద్ధతిలోనే ఉచిత విద్యుత్…కొత్త విధానంలో బిల్లు చెల్లింపు అంటోంది.

ప్రభుత్వం, సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, మంత్రి పేర్ని నాని…..ఇలా ఎంతోమంది ఈ కొత్త పథకం గురించి ఎంత చెప్పినా….రైతుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కొత్త పథకంపై రైతన్నలు పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగానే జగన్ సర్కార్ ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత విద్యుత్ పథకానికి స్వస్తి పలికింది. ఉచిత విద్యుత్ పథకం ఎత్తేస్తే రైతులు నష్టపోతారు. రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి, దానిని నగదు బదిలీ పథకంలా మార్చారు జగన్.

అయితే, ఈ కొత్త కాన్సెప్ట్ రైతులకు గందరగోళాన్ని మిగిల్చింది. కేంద్రంతో ఆ వ్యవహారాలు తేల్చుకొని….ఏపీ ప్రభుత్వమే డిస్కంలకు కరెంటు బిల్లుల్ని చెల్లిస్తే సరిపోతుంది కదా అని రైతులు అంటున్నారు.

అసలు విద్యుత్ ఉచితంగా ఇచ్చేటపుడు…దానికి సంబంధించిన డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తే రైతులకు తిప్పలుండవు కదా అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ ఖాతాల్లో సకాలంలో నగదు బదిలీ చేయకుంటే రైతులు సొంత డబ్బులతో బిల్లులు చెల్లించాలి కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సకాలంలో బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ అధికారుల వేధింపులు తట్టుకోలేమని రైతులు భయపడుతున్నారు. కరోనా వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే…తాము ఎక్కడ నుంచి చెల్లించాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.

కేంద్రం విద్యుత్ సంస్కరణలను పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ అమలు చేయబోనని కరాఖండిగా చెప్పారని, ఏపీ సీఎం జగన్ కూడా అలాగే చెబితే….వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.