‘వి’ అవుతుందా గేమ్ చేంజర్?

ఇంకొన్ని గంటలే మిగిలున్నాయ్ ‘వి’ సినిమా విడుదలకు. నాని లాంటి స్టార్ ప్రధాన పాత్రలో నటించిన.. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ప్రొడ్యూస్ చేసిన సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి ఇలా నేరుగా ఓటీటీల్లో రిలీజవుతుందని ఎవరూ ఊహించలేదు. లాక్ డౌన్ టైంలో వేరే భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీల్లోకి వస్తున్నా.. తెలుగు నిర్మాతలు మాత్రం ఈ విషయంలో వెనుకంజే వేశారు.

స్వయంగా దిల్ రాజే ‘వి’ సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేసే ఉద్దేశం లేదని.. తమ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని అన్నాడు. అలాంటి వాడు చివరికి ఆరు నెలలకు కూడా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటీటీ డీల్‌కు ఓకే చెప్పేశాడు. చిత్ర బృందంలోని వాళ్లందరూ కూడా అంగీకరించక తప్పలేదు. ఇప్పటికే తెలుగులో అరడజను సినిమాల దాకా నేరుగా ఓటీటీ్లోల రిలీజయ్యాయి. కానీ అప్పుడు లేని ఉత్కంఠ ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

ఇంతకుముందు ఓటీటీల్లో రిలీజైన సిినిమాలన్నీ చిన్నవే. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలు ఓటీటీల్లో మంచి స్పందనే రాబట్టుకున్నప్పటికీ.. వాటి గురించి మరీ పెద్ద చర్చేమీ జరగలేదు. ఇండస్ట్రీ మీద అవి మరీ ప్రభావం ఏమీ చూపించలేదు.

ఎందుకంటే అవన్నీ చిన్న బడ్జెట్లో తెరకెక్కినవి. అవి స్టార్ల సినిమాలు కావు. కానీ ‘వి’ అలా కాదు. నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేథా థామస్, ఇంద్రగంటి మోహనకృష్ణ, దిల్ రాజు, అమిత్ త్రివేది, తమన్ లాంటి ప్రముఖులు కలిసి చేసిన సినిమా ఇది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ పెట్టారు దీని మీద. రూ.50 కోట్ల మేర బిజినెస్ చేసే స్థాయి ఉన్న చిత్రమిది.

తెలుగులోనే కాదు.. దక్షిణాదిన మొత్తంలో ఈ స్థాయి సినిమా ఇప్పటిదాకా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాలేదు. అందుకే ఇటు ఇండస్ట్రీ జనాలు.. అటు ప్రేక్షకులు.. అలాగే దీన్ని రిలీజ్ చేస్తున్న అమేజాన్ ప్రైమ్ వాళ్లు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందన్నదాన్ని బట్టి ఇండస్ట్రీ గమనం ఆధారపడి ఉంది.

సినిమా అంచనాల్ని అందుకుని.. భారీగా వ్యూస్ వస్తే, ప్రైమ్ సబ్‌స్కిప్షన్స్, డౌన్ లోడ్స్ పెరిగితే.. ఈ సినిమా మీద రూ.32 కోట్లు పెట్టడం పట్ల ఆ సంస్థ సంతృప్తి చెందితే మున్ముందు మరిన్ని పేరున్న సినిమాలు ఓటీటీల్లోకి రావడానికి, మంచి డీల్స్ జరగడానికి ఆస్కారముంటుంది. మరి ‘వి’ ఆ రకంగా ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ అవుతుందేమో చూడాలి.