ఏపీ మద్యంపై జగన్ పార్టీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు

దేశంలో మరెక్కడా లేని రీతిలో కొత్త కొత్త బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతోంది ఏపీ సర్కారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని పూర్తిగా మార్చేయటమే కాదు.. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి. అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కాకుండా.. కొన్ని ప్రత్యేక బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అలా అమ్ముతున్న మద్యంపై ఏపీ అధికారపక్ష ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గడిచిన కొద్దికాలంగా సొంత ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేస్తూ అందరి నోళ్లలో నానుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా తన మార్క్ కామెంట్స్ తో వార్తల్లోకి వచ్చారు.

ఏపీలో అమ్ముతున్న మద్యాన్ని తాగితే రెండు.. మూడేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఒకే కంపెనీలో తయారయ్యే ఈ మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే అవకాశం ఉందన్నారు. ఏపీలో తయారయ్యే మద్యం చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో దొరికే ఊరు.. పేరు లేని బ్రాండ్లను తాగేయటం మానేయాలన్న ఆయన.. మంచి బ్రాండు ఒక్కటి కూడా ఏపీలో ఎందుకు అమ్మటం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లపై పలు ప్రశ్నలు సంధించారు.

ఈ బ్రాండ్లను ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? వాటి ఉత్పత్తి.. ధరలు ఎవరు డిసైడ్ చేస్తున్నారన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మాయదారి బ్రాండ్ల గురించి ముఖ్యమంత్రి జగన్ కు తెలియనది.. ఈ విషయంపై ఆయన జోక్యం చేసుకొని.. అన్ని వివరాలు తెప్పించుకోవాలన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. సీఎం జగన్ కు తెలీకుండా.. మద్యంపై ఇంతలా నిర్ణయాలు తీసుకుంటున్న వారెవరై ఉంటారంటారు?