విశాఖ వెళదామంటే.. హైకోర్టు సీన్లోకి వచ్చేసిందిగా..

అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం. ఏపీకి ఒక రాజధాని బదులుగా.. ముచ్చటగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం తెర మీదకు రావటం.. అందుకు ఏపీ అసెంబ్లీ ఓకే చేయటం.. రాష్ట్ర గవర్నర్ రాజముద్ర వేయటం వరకు జరిగిన విషయాలు తెలిసిందే. అనంతరం హైకోర్టు ఎంట్రీ వేళ.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇక్కడే ఏపీ సర్కారుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు రాజధాని తరలింపు ఎపిసోడ్ పై హైకోర్టు ఆదేశాల్ని కంటిన్యూ చేసేలా సుప్రీం ఆదేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కొత్త పీటముడిని సుప్రీం తెర మీదకు తీసుకొచ్చింది. రాజధాని తరలింపుపై ఎందుకంత తొందర అన్న మాటతో పాటు.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని తేల్చింది. ఇంతవరకూ ఓకే. ఈ సందర్భంలోనే సుప్రీం టచ్ చేసిన ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారాన్ని ప్రస్తావించింది సుప్రీం ధర్మాసనం.

అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకోవటం తెలిసిందే. దీనిపై సుప్రీం తాజాగా వ్యాఖ్యానిస్తూ.. అమరావతి నుంచి హైకోర్టును తరలించటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటి? అంటూ వేసిన ప్రశ్నకు రాష్ట్ర సర్కారు తరపున న్యాయవాది వెంటనే సమాధానం చెప్పలేకపోయారు.

హైకోర్టు తరలింపుపై మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అంటూ వేసిన ప్రశ్నతో ఏపీ సర్కారుకు రాజధాని తరలింపు వ్యవహారంలో కొత్త చిక్కుముడి ఎదురైనట్లేనన్న వాదన వినిపిస్తోంది. సుప్రీం అడిగిన ప్రశ్నకు రానున్న రోజుల్లో ఏపీ సర్కారు ఏమని సమాధానమిస్తుందో చూడాలి. తాజా పరిణామాన్ని చూస్తే.. విశాఖకు వెళదామన్న ఉత్సాహానికి.. హైకోర్టు అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన సుప్రీం వ్యాఖ్యలు స్పీడ్ బ్రేకర్లుగా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.