వినాయక్‌కు బెర్త్ కన్ఫమ్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండి ఉన్నట్లుండి చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయి, అవకాశాలు అడుగంటిపోయిన దర్శకుడు వి.వి.వినాయక్. చిరు రీఎంట్రీ మూవీ, అందులోనూ రీమేక్ కావడంతో బ్లాక్‌బస్టర్ అయిన ‘ఖైదీ నంబర్ 150’ మినహాయిస్తే గత దశాబ్దంలో వినాయక్ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచినవే.

ముఖ్యంగా ‘ఖైదీ’కి ముందు వెనుక వచ్చిన అఖిల్, ఇంటిలిజెంట్ సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘ఇంటిలిజెంట్’ తర్వాత దర్శకుడిగా వినాయక్ కెరీర్ క్లోజ్ అయినట్లే కనిపించింది. పైగా హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాను కూడా మొదలుపెట్టడంతో అందరూ ఆయన కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేశారు. ఐతే ఆశ్చర్యకరంగా వినాయక్‌కు మళ్లీ చిరంజీవితో పని చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.

ముందు సుజీత్ చేతికి వెళ్లిన ‘లూసిఫర్’ రీమేక్.. అతడి పనితీరు చిరుకు నచ్చక వినాయక్ వైపు మళ్లిన సంగతి తెలిసిందే. ఐతే వెంటనే వినాయక్‌ను కూడా చిరు కన్ఫమ్ చేయలేదు. అతను తన టీంతో కలిసి స్క్రిప్టు ఎలా డెవలప్ చేస్తాడన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం వినాయక్.. తన వెర్షన్ చిరుకు వినిపించాడట. అది చిరుకు కూడా నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్టుతో రమ్మని చిరు చెప్పారట.

వినాయక్‌నే ఈ సినిమాకు దర్శకుడిగా ఖరారు చేసినట్లే అన్నది మెగా కాంపౌండ్ వర్గాల సమాచారం. ‘లూసిఫర్’ పక్కా కమర్షియల్ స్టయిల్లో, ఎలివేషన్లతో సాగే పొలిటికల్ థ్రిల్లర్. సుజీత్ దానికి తన క్రియేటివిటీ జోడించాలని చూశాడో ఏమో కానీ.. చిరును అతను మెప్పించలేకపోయాడు. వినాయక్‌కు ఇలాంటి సినిమాలు డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒరిజినల్‌ను ఫాలో అయిపోతూ.. ‘ఖైదీ నంబర్ 150’ తరహాలో ఇంకొంచెం కమర్షియల్ టచ్ ఇస్తే పాసైపోయినట్లే.