గంగవ్వను గ్లోబల్ స్టార్ చేసిన యూట్యూబ్

ఈ టెక్ జమానాలో సోషల్ మీడియాకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అనామకులను సైతం రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసిన ఘనత సోషల్ మీడియాదే. రెక్కాడితేగానీ డొక్కాడని వారిని కూడా లక్షాధికారులను చేసిందీ సోషల్ మీడియా. కన్నానులే…అంటూ ఇంటర్నెట్ ను షేక్ చేసిన పల్లె కోయిల బేబీ మొదలు….‘‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హై’’ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకునే రాణు ముండల్ వరకు ఎంతోమంది టాలెంట్ ను వెలికి తీసింది సోషల్ మీడియానే. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన బేబీ అయినా…పశ్చిమ బెంగాల్ నుంచి రాణు ముండల్ అయినా….ఓవర్ నైట్ లో సెలబ్రిటీలయ్యారంటే అది సోషల్ మీడియా పుణ్యమే. ఇలాగే యూట్యూబ్ పుణ్యామా అంటూ తెలంగాణలోని మారుమూల పల్లెటూరుకు చెందిన నిరక్షరాస్యురాలు మిల్కురి గంగవ్వ(58)…అనతికాలంలోనే సెలబ్రిటీ, సినీ ఆర్టిస్ట్ అయిపోయింది. యూట్యూబ్ స్టార్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత సీఎన్ఎన్ మీడియా సంస్థ ఓ ప్రత్యేక కథనం రాసి ….ఆమెపై ఒక షో చేసే స్థాయికి గంగవ్వ ఎదిగింది.

కూలీ పనులు చేసుకుంటూ…కనీసం తన ఊరుదాటి బయటికి వెళ్లడం కూడా తెలియని గంగవ్వను యూట్యూబ్ ఓ స్టార్‌గా మార్చేసింది. ‘మై విలేజ్ షో’ యూబ్యూబ్ చానెల్ తో గంగవ్వ దేశవ్యాప్తంగానే కాదు…ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అచ్చ తెలంగాణ పల్లె యాసతో మాట్లాడే గంగవ్వ ఇస్మార్ట్ శంకర్, మల్లేశం సినిమాల్లో నటించింది. 100కు పైగా షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది. యూట్యూబ్ లో గంగవ్వ స్కిట్ లకు ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో, ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వారి టెక్ ఫర్ గుడ్ షోలో పాల్గొనేంత ఎత్తుకు గంగవ్వ ఎదిగింది.కొందరి జీవితాలను టెక్నాలజీ ఎంతగా మార్చివేసిందో ఈ షో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది సీఎన్ఎన్. టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యక్తిగత అవరోధాలను అధిగమించి తమ అభిరుచులను, ఆకాంక్షలను నెరవేర్చుకున్నవారి విజయగాథలను సీఎన్ఎన్ ప్రసారం చేయనుంది. ఇందులో భాగంగానే విలేజ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన గంగవ్వపై సీఎన్ఎన్ ప్రత్యేక కథనం ప్రసారం చేయనుంది. ఇక, త్వరలో మొదలు కాబోతోన్న తెలుగు బిగ్ బాస్-4లో గంగవ్వ ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా కనిపించే గంగవ్వ సాదాసీదా పల్లెటూరు మనిషి. అక్షరం ముక్క రాని గంగవ్వకు సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులున్నారు. ముగ్గురు పిల్లలు…8 మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వకు తన అసలు వయసెంతో కూడా తెలీదు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని లంబాడపల్లికి చెందిన గంగవ్వలోని నటనా పటిమను గుర్తించింది ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్. ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానల్‌ను శ్రీరామ్ ప్రారంభించే నాటికి గంగవ్వకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలీదు. శ్రీరామ్, అతడి స్నేహితుడు ఊళ్లో వీడియోలు తీస్తుంటే….వారిద్దరికీ పనీపాట లేదనుకునేది గంగవ్వ. అటువంటి గంగవ్వ… 2017లో పూర్తి స్థాయిలో యూ ట్యూబ్ ఛానల్‌లో భాగమైంది. ఆమె కెమెరా ముందు మాట్లాడితే.. మనతో మాట్లాడుతున్నట్లే సహజంగా ఉంటుంది. నటనలా అనిపించదు.

అయితే, యూట్యూబ్ స్టార్‌గా మారక ముందు గంగవ్వ ఎన్నో కష్టాలు పడింది. ఊహ తెలియక ముందే తండ్రి చనిపోయాడు. 13 ఏళ్లొచ్చాక తల్లి మరణించింది. దీంతో తమ్ముళ్ల బాధ్యతను ఆమే తీసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడంతో.. రోజూ గొడవలయ్యేవి. పగలు కూలీ పనులకు వెళ్తూ.. రాత్రి పూట బీడీలు చుడుతూ పిల్లలను పెంచింది. పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన భర్త నయాపైసా పంపలేదు. భర్త అక్కడే చనిపోయాడు. భర్త లేకపోయినా…ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకును పెంచి పెద్ద చేసింది. ఈ కష్టాలన్నీ దిగమింగుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వ.. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని తన అప్పులన్నీ తీర్చేసింది.

గంగవ్వ నటనకు జనం ఫిదా కావడంతో.. 15 లక్షల మందికిపైగా మై విలేజ్ షో ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. గంగవ్వ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సినీతారలు, సెలబ్రిటీలతో సహా 45 వేల మందికిపైగా ఫాలో అవుతున్నారు..మనలోని శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చని నవ్వుతూ చెబుతుంది గంగవ్వ. కెమెరా ముందు నటించడం తనకెంతో ఇష్టమని, తన నటనను దేశవ్యాప్తంగా లక్షలాది మంది చూస్తుండడం, అభిమానిస్తుండడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని చెబుతోంది. నిలకడగా ఆదాయం వస్తుండటంతో… త్వరలోనే ఓ ఇల్లు కట్టుకుంటానని చెబుతోంది. కష్టాన్ని, టాలెంట్ ను నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన గంగవ్వ…నిస్సత్తువతో నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న వారందరికీ ఆదర్శం.