బ్ర‌హ్మి నోట క‌న్నీళ్లు తెప్పించే మాట‌

Brahmanandam
Brahmanandam with his grandson

ఇప్పుడు వివిధ రంగాల్లో ప్ర‌ముఖులుగా వెలుగొందుతున్న చాలా మంది ఒక‌ప్పుడు అనేక క‌ష్టాలు ప‌డ్డ‌వాళ్లే. తిండికి, క‌నీస అవ‌స‌రాల‌కు ఇబ్బంది ప‌డ్డ‌వాళ్లే. అలాంటి వాళ్ల‌లో తానూ ఒక‌డిన‌ని అంటున్నారు లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం. ఎప్పుడూ తెర‌పై న‌వ్వించే ఆయ‌న.. అప్పుడ‌ప్పుడూ వ్య‌క్తిగ‌త విష‌యాలు చెబుతూ ఎమోష‌న‌ల్ అవుతుంటారు.

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ త‌న చిన్న‌ప్ప‌టి రోజుల్ని గుర్తు చేసుకుని ఆయ‌న ఉద్వేగానికి గుర‌య్యారు. చిన్న‌ప్పుడు త‌మ కుటుంబంలో అంద‌రూ ఆక‌లితో అల‌మ‌టించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

‘‘ఒక పూట భోజనం లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ములం ఎలా ఎదురు చూశామో నాకు తెలుసు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి. రెక్కాడితో కానీ డొక్కాడదనే పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఎం.ఎ చేసి, లెక్చరర్‌ ఉద్యోగంలో చేరి.. ఈ స్థితికి వచ్చాను. అందుకే సహనంగా, ఓర్పుగా ఉండమని చెప్పే అర్హత నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. పనికి వెళ్తేనే కుటుంబానికి రోజు గడిచే పరిస్థితిని నేను అనుభవించా. అది ఎంతో భయంకరంగా ఉంటుంది. 18 రోజులు తిండి తినకపోతే చనిపోతారంటారు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచొద్దు. 18వ రోజు అడుక్కోరా.. లేకపోతే చచ్చిపోతావు అని మా నాన్న నాకు చెప్పేవారు’’ అని బ్ర‌హ్మి గుర్తు చేసుకున్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఎంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. ఆ ప‌రిస్థితుల్లో మనందరి కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల్ని, పాత్రికేయుల్ని అభినందించాలని.. ప్రధాని మోడీ వీళ్లంద‌రినీ ప్రోత్సహిస్తూ సమావేశాల్లో ప్రసంగిస్తున్నారని బ్ర‌హ్మి అన్నాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్ పెడితే ఓ భరోసా క‌లుగుతోంద‌ని.. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వయసులో చిన్నవాడైనా మంత్రులతో చర్చించి ప్రజలు బాధపడకూడదని చర్యలు తీసుకుంటున్నార‌ని.. ఇలాంటి నాయ‌కుల‌కు అంద‌రం స‌హ‌క‌రించాల‌ని బ్ర‌హ్మి పిలుపునిచ్చారు.