‘ఆది పురుష్’ టైమింగ్ అదిరిపోలా..

ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్లు లైన్లో ఉండగా అతను.. ఏరి కోరి మన ప్రభాస్‌తో.. అది కూడా రామాయణ కథను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు.

వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి ఆ తర్వాతి ఏడాది విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన టైమింగ్.. అలాగే రిలీజ్ చేయబోయే టైమింగ్ చాలా ప్రత్యేకం కావడం విశేషం. ఈ నెల ఐదో తారీఖున అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరిగింది. అది జరిగిన రెండు వారాలకే రాముడి కథతో ‘ఆది పురుష్’ అనౌన్స్ చేసి ఆసక్తి రేకెత్తించారు.

ఇక ఈ సినిమా విడుదలయ్యేదేమో రామాలయం పూర్తయ్యే సమయానికి అన్నది తాజా సమాచారం. దేశంలోని అద్భుత ఆలయ నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ స్థాయిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించడానికి అయోధ్యరాామాలయ ట్రస్టు సన్నాహాలు చేస్తున్నాయి. వందల కోట్ల ఖర్చుతో అది నిర్మితం కానుంది.

కరోనా కారణంగా భూమి పూజ కార్యక్రమాన్ని సింపుల్‌గా చేసేశారు కానీ.. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాత్రం హంగామా మామూలుగా ఉండదు. అప్పుడు దేశంలోని హిందువులందరి ఉద్వేగం పతాక స్థాయికి చేరుకోవడం ఖాయం. అది జరిగిన తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాను రిలీజ్ చేస్తే టైమింగ్ అదిరిపోతుందంతే. సినిమా సరిగ్గా తీయాలే కానీ.. అద్భుత ఫలితం అందుకోవడానికి అవకాశముంది. కచ్చితంగా ప్రభాస్ మరోసారి ‘బాహుబలి’ తరహా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.