డా. రమేష్ బాబు ను పట్టిస్తే రూ.లక్ష

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన స్వర్ణ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ ఉదంతంలో కీలక వ్యక్తులు గాయబ్ కావటం తెలిసిందే. వారిని విచారిస్తేకానీ.. ఈ ప్రమాదానికి సంబంధించిన స్పష్టత రాని పరిస్థితి.

ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత నుంచి రమేశ్ ఆసుపత్రి ఎండీ పి. రమేశ్ బాబు.. స్వర్ణాప్యాలెస్ ఎండీ ముత్తవరపు శ్రీనివాసరావుతో సహా పలువురు కీలక వ్యక్తుల ఆచూకీ తెలీకుండా ఉంది.

వారు పరారైనట్లుగా చెబుతున్నారు. వారిని విచారించినప్పుడు మాత్రం ఈ ప్రమాదానికి కారణాలు తెలిసే వీలుంది. దీంతో.. వీరి కోసం ప్రయత్నించిన పోలీసులు ఆచూకీ తెలుసుకునేందుకు ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత.. పోలీసులు అడిగిన డాక్యుమెంట్లలో ఏ ఒక్క పత్రాన్ని స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యం కానీ రమేశ్ ఆసుపత్రి వారు కానీ ఇవ్వలేదంటున్నారు.

దీంతో.. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరుల్లోనూ గాలింపులు జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణా ప్యాలెస్ ఆగ్నిప్రమాదంలో కీలక వ్యక్తులుగా మారిన వారి వివరాల్ని పోలీసులకు తెలియజేస్తే రూ.లక్ష నజరానా ఇవ్వనున్నట్లుగా ఏపీ పోలీసులు చెబుతున్నారు. మరి.. పోలీసులు ప్రకటించిన రూ.లక్షతో అయినా పరిస్థితుల్లో మార్పు వచ్చి.. వారి వివరాలు తెలుస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.