సల్మాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందా?

ఓ హత్య కేసులో అరెస్టయిన వ్యక్తిని విచారించిన సందర్భంగా వెల్లడైన విషయాలతో ఉత్తరాఖండ్ పోలీసులు షాకవుతున్నారు. ఆ వ్యక్తి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడని, ముంబయిలో సల్మాన్ ఇంటి దగ్గర రెక్కీ కూడా నిర్వహించినట్లు తేలడంతో విస్మయానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం సంచలనం రేపుతోంది. హత్యలు, దొమ్మీలు చేస్తున్న లారెన్స్ బిష్ణోయ్ అనే ఒక గూండా గ్యాంగును ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగుకు చెందిన రాహుల్ అలియాస్ సన్నీ అనే షార్ప్ షూటర్.. ప్రవీణ్ అనే రేషన్ షాపు నడిపే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలో రాహుల్ గురించి మరో సంచలన విషయం వెల్లడైంది.

ఈ ఏడాది జనవరిలో సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడం కోసం ముంబయికి వెళ్లి రెక్కీ నిర్వహించినట్లు తేలింది. సల్మాన్ ఇంటితో పాటు పలు చోట్ల అతను రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. బాంద్రాలోని సల్మాన్ ఇంటికి సమీపంలో రాహుల్ రెండు రోజుల పాటు బస చేసినట్లు కూడా వెల్లడైంది. బిష్ణోయ్, సంపత్ నెహ్రా అనే ఇద్దరు గూండాల ఆదేశాల మేరకు తాను ఈ రెక్కీ నిర్వహించినట్లు రాహుల్ పోలీసులకు తెలిపాడు. సంపత్ నెహ్రా 2018లో సల్మాన్ హత్య కోసం కుట్ర పన్నడమే కాక.. అతడి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి పోలీసులకు దొరికిపోయాడు. దీన్ని బట్టి చూస్తే సల్మాన్ హత్య కోసం చాలా కాలం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. కానీ వీళ్లు ఇలా ఎందుకు చేయాలనుకున్నారన్నది మాత్రం వెల్లడి కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాహుల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది.