రజినీ-కమల్ మల్టీస్టారర్.. నిజ్జంగానే

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్‌లది తిరుగులేని కాంబినేషన్. తమిళంలో అతి పెద్ద స్టార్లుగా అవతరించి.. ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు సంపాదించిన ఈ ఇద్దరూ కెరీర్ ఆరంభంలో కలిసి సినిమాలు చేశారు. వాటితో మంచి గుర్తింపు, విజయాలూ అందుకున్నారు. ఐతే ఇద్దరూ సూపర్ స్టార్లుగా ఎదిగాక మాత్రం కలిసి నటించింది లేదు. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు.

వీళ్లు మళ్లీ కలిసి నటిస్తే చూడాలని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. వారిలో ఆశలు రేకెత్తిస్తూ.. ఈ మధ్య ఈ కలల కాంబినేషన్లో మల్టీస్టారర్ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి వేర్వేరుగా పార్టీలు పెట్టి సినిమాల నుంచి నెమ్మదిగా తప్పుకునే ఆలోచనల్లో ఉన్న ఈ దశలో కలిసి సినిమా ఎక్కడ చేస్తార్లే అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కానీ ఈ ఇద్దరు సూపర్ స్టార్లు నిజంగానే కలిసి నటించబోతున్నారు. వీరి కలయికను మళ్లీ తెరపైకి తేవడానికి యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్‌ను రజినీ-కమల్ మల్టీస్టారర్ గురించి అడిగితే.. దీని గురించి తానేమీ మాట్లాడనని.. నిర్మాణ సంస్థే వివరాలు వెల్లడిస్తుందని అన్నాడు. కొట్టిపారేయకుండా ఇలా మాట్లాడాడంటే లోకేష్.. రజినీ-కమల్‌లతో సినిమా చేయబోతున్నాడన్నమాటే.

‘నగరం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్.. ఆ తర్వాత ‘ఖైదీ’తో వావ్ అనిపించాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అది విడుదల కాకముందే అతను విజయ్ లాంటి పెద్ద స్టార్‌తో ‘మాస్టర్’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. దాని మీదా మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఏకంగా రజనీ-కమల్ మల్టీస్టారర్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు ఓ తెలుగు టాప్ స్టార్‌తో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి లోకేష్ ఒప్పందం చేసుకున్నాడు.