రేవంత్‌కు కొత్త షాకివ్వ‌బోతున్న కేసీఆర్‌

టీఆర్ఎస్‌ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్ రెడ్డి మ‌ధ్య ఉన్న రాజ‌కీయ విమ‌ర్శ‌ల యుద్ధం గురించి ప్ర‌త్యేకం‌గా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయ‌డంలో రేవంత్ ముందుంటారు. దాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుంది. అయితే, తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ స‌ర్కారుకు కీల‌క అవ‌కాశం దొరికింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే అవినీతి ఎమ్మార్వో ఏసీబీకి చిక్కిన ఉదంతం.

హైద‌రాబాద్ కీసర తాసిల్దార్‌ నాగరాజు ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉదంతం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఎపిసోడ్ మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం తాసిల్దార్‌ నాగరాజు శుక్రవారం రూ.కోటి 10 లక్షల తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. లంచం ఇస్తున్న ఉప్పల్‌లోని సత్య డెవలపర్స్‌కు చెందిన చౌవ్ల శ్రీనాథ్‌యాదవ్‌, రాంపల్లి దయారా గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డిని సైతం అరెస్టు చేశారు.

ఈ కేసులో కీలకవ్యక్తిగా ఉన్న రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డి ఇంట్లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి సంబంధించిన పలు అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి.. ఎంపీలాడ్స్‌ సంబంధించిన పలు పత్రాలు, పలు వివాదాస్పద భూములపై రేవంత్‌రెడ్డి ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తులు ఇందులో ఉన్నాయి. అంజిరెడ్డికి రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగానూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ భారీ అవినీతి ఎపిసోడ్ అంశంతో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు.