ఏపీ ప్రభుత్వం కూలిపోతుంది – RRR

ఏమాటకు ఆమాట… ఇంతవరకు వైఎస్ జగన్ కి రఘురామరాజు ఒక్క తప్పుడు సలహా ఇవ్వలేదు. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు నిజమైన అభిమాని అవునో కాదో తెలియదు గాని రఘురామరాజు మాత్రం… వైసీపీని, జగన్ ని తప్పు దోవ పట్టించే సలహా ఎపుడూ ఇవ్వలేదు. వారి తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపుతూ వచ్చారు. వాటిని సరిదిద్దుకుని 30 ఏళ్లు అధికారంలో ఉండమని జగన్ ను కోరారు. కానీ అలా కోరిన రఘురామరాజు నేడు ‘జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఓ తెలుగు పత్రిక న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది అంటూ ఒక సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇది ఈరోజు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ వారి వ్యవహారంపై మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రి జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు రావొచ్చన్నారు.

నా ఫోన్లు కూడా ట్యాప్ చేసే ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వం మధ్య వైరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ భావిస్తోందని చెబుతున్నారు. కొన్ని శక్తులు న్యాయవస్థను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోందట. ఆ క్రమంలోనే ఈ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.