ఏపీ సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోంది-హీరో రామ్

ఎప్పుడూ ట్విట్టర్లో సినిమాల గురించే మాట్లాడే టాలీవుడ్ హీరోలు రాజకీయాల గురించి సీరియస్‌గా మాట్లాడితే షాకవ్వాల్సందే. యువ కథానాయకుడు రామ్ ఇలాగే శనివారం అందరికీ షాకిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేరు చెడగొట్టేలా కొందరు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారంటూ అతను ట్వీట్ వేసి ఆశ్చర్యపరిచాడు.

దీనికి కారణం విజయవాడలో కొన్ని రోజుల కిందట కోవిడ్ హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చుట్టూ ముసురుకున్న వివాదమే కారణం. అక్కడి స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న రమేష్ హాస్పిటల్.. రామ్ కుటుంబ సభ్యులదే అన్న సంగతి ఇప్పటికే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఫైర్ సేఫ్టీ చూసుకోకుండా స్వర్ణ ప్యాలెస్‌లో ఆసుపత్రి ఏర్పాటు చేసిన రమేష్ హాస్పిటల్‌దే అగ్ని ప్రమాదానికి బాధ్యత అని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రామ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మూడు వారాల ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నడుపుతోందని.. అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ప్రభుత్వానిదే బాధ్యతా అని ప్రశ్నించాడు రామ్.

ఆసుపత్రి ఏర్పాటు తర్వాత కూడా స్వర్ణ ప్యాలెస్ అందులో దిగే అతిథులకు బిల్లులు ఇచ్చిందని.. అంటే భవనం వారి ఆధ్వర్యంలోనే ఉందని.. అలాంటపుడు అగ్ని ప్రమాదానికి రమేష్ హస్పిటల్ వారిని ఎలా బాధ్యులు చేస్తారని అతను ప్రశ్నిస్తున్నట్లుంది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని.. సీఎం గమనించాలని రామ్ అన్నాడు. #apiswatching అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి అతను ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్లు గుప్పించాడు.