‘ఇండియన్-2’ వివాదానికి తెర

ఏ ముహూర్తాన కమల్ హాసన్‌తో ‘ఇండియన్-2’ సినిమాను శంకర్ ప్రకటించాడో కానీ.. ఆ చిత్రానికి అస్సలు కలిసి రావడం లేదు. ఈపాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఇంకా సగం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. కమల్ రాజకీయ కమిట్మెంట్లు.. మేకప్ కష్టాలు.. ఇంకేవో ఇబ్బందుల కారణంగా రెండుమూడుసార్లు షూటింగ్ ఆగింది.

అవన్నీ దాటుకుని శరవేగంగా షూటింగ్ చేస్తున్న సమయంలో క్రేన్ ప్రమాదంలో యూనిట్ సభ్యులు ముగ్గురు చనిపోవడం, కొంతమంది గాయపడటంతో మళ్లీ బ్రేక్ పడింది. అది పెద్ద వివాదంగా మారడంతో నిరవధికంగా వాయిదా పడ్డ షూటింగ్.. కరోనా కారణంగా మళ్లీ మొదలే కాలేదు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయినా సరే.. ‘ఇండియన్-2’ తిరిగి పట్టాలెక్కుతుందా లేదా అనే విషయంలో సందేహాలున్నాయి.

క్రేన్ ప్రమాదానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వాళ్ల నిర్లక్ష్యమే కారణం అంటూ హీరో కమల్ హాసన్ ఆ మధ్య విమర్శలు చేశాడు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న సమయంలో కమల్ విమర్శలు లైకా వాళ్లకు మరింత ఇబ్బందికరంగా మారాయి. దీని చుట్టూ వివాదం ముసురుకుని సినిమాను మధ్యలో ఆపేస్తారేమో అన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి.

ఐతే నెమ్మదిగా సమస్య తీవ్రత తగ్గింది. కమల్, లైకా అధినేతల మధ్య రాజీ కుదిరింది. తాజాగా లైకా సంస్థ బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం అందించడంతో కమల్ కూడా శాంతించాడు. ఆయన చేతుల మీదుగానే బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ కూడా జరిగింది.

ముగ్గురు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించడం గమనార్హం. అలాగే తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి కుటుంబానికి రూ.90 లక్షలు అందజేశారు. మొత్తానికి వివాదానికి తెరపడటంతో పరిస్థితులు చక్కబడ్డాక ‘ఇండియన్-2’ చిత్రీకరణ పున:ప్రారంభించడానికి మార్గం సుగమమైనట్లే.