పాపం.. చంద్ర‌బాబును ప‌ట్టించుకునే వాళ్లు లేరు

జగ‌న్ స‌ర్కారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని నుంచి త‌ర‌లించ‌డం.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నకు ఆమోద ముద్ర వేయించుకోవ‌డం మీద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఈ అంశం మీద అసెంబ్లీని ర‌ద్దు చేసి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్దామ‌ని.. మ‌ళ్లీ ఎన్నిక‌లు జరిపించి ఎవ‌రి స‌త్తా ఏంటో తేల్చుకుందామ‌ని స‌వాలు విసురుతూ వీరావేశంతో 48 గంట‌ల గ‌డువు ప్ర‌క‌టించారు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు.

కానీ ఆయ‌న స‌వాల్ గురించి ప‌ట్టించుకునే నాథుడే క‌ర‌వయ్యాడు. అమ‌రావ‌తి విష‌యంలో బాబుకు చిత్త శుధ్ధి ఉన్నా.. లేదంటే మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై జ‌నాభిప్రాయం ఏంటో తెలుసుకోవాల‌న్నా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంద‌రితో రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని వైకాపా నేత‌లు స‌వాలు విసిరితే బాబు ప్ర‌తిగా అసెంబ్లీ ర‌ద్దు చేయాలంటూ స‌వాల్ విసిరారు.

48 గంట‌ల గ‌డువిస్తున్నా.. త‌ర్వాత మ‌ళ్లీ వ‌స్తా అంటూ వెళ్లిపోయారు. కానీ మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేయ‌డ‌మే కాక‌.. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న బాబును ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆయ‌న స‌వాల్ గురించి మాట్లాడేవాళ్లే లేదు. మ‌ధ్య‌లో తెలుగుదేశం పార్టీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ లోఇంకో 12 గంట‌ల గ‌డువుందంటూ జ‌గన్‌కు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఫ‌లితం లేక‌పోయాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ స‌వాల్ గురించి ఆరంభంలో తెగ హ‌డావుడి చేసింది. ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చారు. కానీ ఈ స‌వాల్‌ను జ‌గ‌న్ దాకా ఎందుకు చోటా మోటా వైకాపా నాయ‌కులు కూడా ప‌ట్టించుకోలేదు. వేరే పార్టీల వాళ్లూ దీని గురించి స్పందించ‌లేదు. టీడీపీలోనూ దీనిపై చ‌ర్చ లేదు. మీడియా వాళ్లు కూడా ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్న‌ట్లే ఉన్నారు.