రియా చక్రవర్తికి సుప్రీం కోర్టు షాక్!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో ముంబై పోలీసుల విచారణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో, తాజాగా, సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు, సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రియా చక్రవర్తి అభ్యర్థనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రియాకు రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీం, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థననూ తిరస్కరించింది.

సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి చుట్టూ రోజుకో ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రియాను ముంబై పోలీసులు 11 గంటలపాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని, తనకు ప్రొటెక్షన్ కల్పించాలని సుప్రీంను రియా ఆశ్రయించారు. ఆ రెండు అభ్యర్థనలను సుప్రీం తిరస్కరించడంతో రియాకు చుక్కెదురైంది.

దీంతోపాటు,ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి 3 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏక సభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీం వాయిదా వేసింది. తాజాగా సుప్రీం ఆదేశాలతో ఏ క్షణంలోనైనా రియాను బీహార్ పోలీసులు ప్రశ్నించే అవకాశముంది.