సీబీఐకి సుశాంత్ కేసు.. ఆమెకిక సంకెళ్లేనా?

రెండు నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మద్దతుదారులు కోరుకున్న పరిణామం బుధవారం చోటు చేసుకుంది. అతడి మృతి కేసును సీబీఐ టేకప్ చేయబోతోంది.

సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటుబాలీవుడ్ బడా బాబులకు ఈ కేసుతో సంబంధం ఉందని.. కానీ ముంబయి పోలీసులు ఈ కేసు తీవ్రత తగ్గించేలా, వాళ్లెవ్వరికీ ఇబ్బంది రాకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎంక్వైరీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.

ఎట్టకేలకు సుశాంత్ మద్దతుదారులు కోరుకున్నదే జరిగింది. ఈ కేసు సీబీఐ చేతికే వెళ్లనుంది. కాగా.. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్టు కచ్చితంగా జరుగుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

సుశాంత్ మృతి వెనుక కచ్చితంగా రియా ఉందని.. అతను బలవన్మరణానికి పాల్పడటానికి కారణం ఆమేనని పెద్ద ఎత్తునే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ తండ్రి సైతం ఆమెపై ఆరోపణలు చేశాడు. గత రెండు నెలల్లో సుశాంత్ అకౌంట్ నుంచి రియా రూ.3 కోట్ల దాకా వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే కొన్ని రోజుల కిందట ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌ను అనుమానాస్పద రీతిలో రియా ఖాళీ చేసి వెళ్లిపోవడం సందేహాలు రేకెత్తించింది.

సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ సైతం రియా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆమెతో గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చాక సుశాంత్ నీరుగారిపోయాడని.. ఆమె అనేక రకాలుగా సుశాంత్‌ను ఇబ్బంది పెట్టిందని అన్నాడు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈ కేసును టేకప్ చేయగానే రియాను అదుపులోకి తీసుకుంటారని.. అరెస్టు ఖాయమని అంటున్నారు.