ఐపీఎల్ నుంచి వివో ఔట్‌.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

మొత్తానికి బీసీసీఐ దిగి రాక త‌ప్ప‌లేదు. చైనా వ్య‌తిరేక ఉద్య‌మం జోరుగా సాగుతున్న వేళ ఆ దేశానికి చెందిన వివో మొబైల్ కంపెనీని ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగించాల‌ని భార‌త క్రికెట్ బోర్డు నిర్ణ‌యించ‌డంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. బోర్డు వ‌ర్గాలు మాత్రం వివో త‌ప్పుకున్న మాట వాస్త‌వ‌మే అంటున్నాయి.

చైనా భాగస్వామ్యం ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టుల్నే రద్దు చేస్తున్నారు. కొన్ని నెల‌లుగా క్రితం భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన‌డం, 23 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డం ఈ నేపథ్యంలో భారత్‌లో చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబిక‌డం తెలిసిందే.స్వయంగా ప్రభుత్వమే 59 యాప్‌లను నిషేధించింది. చైనా వ‌స్తువుల్ని బహిష్క‌రించాల‌ని జ‌నాల‌కు నేత‌లు పిలుపునిస్తున్నారు. కానీ బీసీసీఐ ఇదేమీ ప‌ట్టించుకోకుండా కానీ వివోతో భాగస్వామ్యం కొనసాగుతుందని ఇటీవ‌ల‌ తేల్చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌య్యాయి.

ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వెనుకంజ ఈ ఏడాది వ‌ర‌కేన‌ట‌. భార‌త్, చైనా మ‌ధ్య సంబంధాలు మెరుగుబ‌డి.. చైనా వ్య‌తిరేక ఉద్య‌మం చ‌ల్ల‌బ‌డితే వ‌చ్చే రెండేళ్లు య‌ధావిధిగా ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగాల‌న్న‌ది వివో ఆలోచ‌న‌. ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ ఏటా రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. మ‌రి ఈ 440 కోట్ల లోటును బీసీసీఐ ఎలా భ‌ర్తీ చేస్తుందో.. ఏ కంపెనీ ఈ ఒక్క ఏడాదికి టైటిల్ స్పాన్స‌ర్ అవుతుందో చూడాలి.