క్రికెట్లో వాడుతున్న స్ట్రాటజీ.. రానా పెళ్లిలో

బయో సెక్యూర్ బబుల్.. ఈ మధ్య ఆటల్లో బాగా ప్రాచుర్యం పొందిన మాట. ముఖ్యంగా క్రికెట్లో ఇది బాగా చర్చనీయాంశం అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెటింగ్ దేశాలూ కరోనాతో అల్లాడుతూ కనీసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్న వేళ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విజయవంతంగా ఓ టెస్టు సిరీస్ నిర్వహించిందంటే అందుక్కారణం.. ఈ బయో సెక్యూర్ బబులే.

కరోనా సోకకుండా సురక్షిత వాతావరణంలో క్రికెట్ నిర్వహించడానికి ఈ విధానాన్ని అనుసరించారు. దీని ప్రకారం సిరీస్ ఆరంభానికి మూడు వారాల ముందే ఆటగాళ్లు, సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకుని.. నెగెటివ్ తేలాక హోటల్లో క్వారంటైన్ అవుతారు. రెండు వారాల తర్వాత మరోసారి పరీక్షలు చేసి మ్యాచ్‌కు అనుమతిస్తారు.

ఇక మ్యాచ్ అయ్యేవరకు ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బంది కేవలం స్టేడియాలకు, హోటళ్లకు మాత్రమే పరిమితమవుతారు. వీళ్లను వేరే వాళ్లు కలవరు. ఎవరూ ఈ బబుల్ దాటి బయటికి వెళ్లకూడదు. తద్వారా ఎవరికీ వైరస్ సోకే అవకాశం ఉండదు. ఈ పద్ధతిలో విజయవంతంగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ నిర్వహించారు. ఇంగ్లాండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ను బుధవారం నుంచి మొదలుపెడుతున్నారు. వేరే క్రీడల్లోనూ అనుసరిస్తున్న ఈ బయో సెక్యూర్ పద్ధతిని ఇప్పుడు మన దగ్గుబాటి రానా పెళ్లిలోనూ వినియోగిస్తున్నారట.

ఈ నెల 8న అతను మిహీకా బజాజ్‌ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో పాల్గొనబోయే అతిథులందరి జాబితా తయారు చేసి కొన్ని వారాల ముందు నుంచే అందరికీ పరీక్షలు చేసి క్వారంటైన్ చేశారట. పెళ్లి అయ్యే వరకు వీళ్లెవ్వరూ బబుల్ దాటి బయటికి వెళ్లట్లేదు. పెళ్లికి అవసరమైన అన్నింటినీ ముందే సిద్ధం చేసుకున్నారు. కరోనా భయం లేకుండా స్వేచ్ఛగా, సంతోషంగా పెళ్లి పూర్తి చేయడానికి ఈ ఏర్పాటు చేశారు. ఇది విజయవంతం అయితే తర్వాతి సెలబ్రెటీ పెళ్లిళ్లన్నీ ఈ పద్ధతిలోనే జరుగుతాయేమో.