మూడు రాజధానులు.. వాస్తవంలో ఏం జరగనుంది?

మొన్నటి వరకూ ఏపీ రాజధాని అన్నంతనే అమరావతిగా చెప్పుకున్నారు. ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. తర్వాతి కాలంలో అవి కాస్తా పెరగటం.. అనుకున్నట్లే ఒకటి కాస్తా మూడు రాజధానుల ప్రపోజల్ తెర మీదకు వచ్చింది. అందుకు తగ్గట్లే.. మూడు రాజధానులకు సంబంధించి బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందటం.. అధికార పార్టీకి బలం లేని శాసన మండలిలో ఆమోదం పొందకున్నా.. గవర్నర్ వద్దకు పంపారు.

మొత్తానికి ఆయన కూడా తన ఆమోద ముద్ర వేయటంతో ఏపీ రాజధాని అమరావతి అన్న కథ కంచికి చేరి.. మూడు రాజధానుల రాష్ట్రంగా ఏపీ కానుంది. సీఎం జగన్ ఆలోచన ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని.. అమరావతి శాసన రాజధాని.. విశాఖ పరిపాలనా రాజధాని కానుంది.

అయితే.. విభజన చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం కేంద్రం అనుమతితో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలతో రాజధానిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే.. ఏపీ సీఎం జగన్ చెప్పినట్లుగా మూడు రాజధానులకు అవకాశం లేదన్నది ఎంపీ రఘురామ రాజు మాట.

ఇదంతా పక్కన పెడితే.. మూడు రాజధానుల రాజధానిగా ఏపీ మారనుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రాజకీయ వర్గాలు వినిపించే వాదన ఆసక్తికరంగా వినిపిస్తుంది. లోగుట్టు సంభాషణల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ వాదనకు అవునన్న మాట చెబుతుండటం విశేషం.

ఇంతకీ వారు చెప్పేదేమంటే.. కర్నూలు ఎప్పటికి రాజధాని నగరంగా మారే అవకాశం లేదంటున్నారు. దీనికి కారణం.. రాష్ట్ర హైకోర్టు అమరావతి నుంచి కర్నూలు వెళ్లాలంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ప్రాక్టికల్ గా అమలుకాదన్నమాట వినిపిస్తుంది. ఎప్పటికప్పుడు న్యాయ రాజధానిగా చెబుతూ కాలం గడిపే అవకాశం ఉంటుందే తప్పించి.. వాస్తవ రూపంలోకి వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తుంది.

ఇక.. అమరావతిని ఏపీ శాసన రాజధానిగా చెబుతారు కానీ.. వీలైనంతవరకు అన్ని కార్యకలాపాలు విశాఖలోనే జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. సీఎం జగన్ ఫోకస్ మొత్తం తాను ఏర్పాటు చేస్తున్న రాజధానిలో తన మార్కు కనిపించాలన్న తపన గ్యారెంటీ అని చెబుతున్నారు. ఏ నగరంలో అయితే తన తల్లి ఓటమిపాలయ్యారో.. అదే నగరాన్ని రాజధానిగా మార్చటంతో పాటు..రాజకీయంగా తాము తిరుగులేని అధిక్యతను సాధించటమే జగన్ ముందున్న లక్ష్యమని చెబుతున్నారు.

కాగితాల్లో చూసినప్పుడు మూడు రాజధానులు కనిపించినా.. ప్రాక్టికల్ గా మాత్రం రెండు రాజధానులే ఉంటాయని.. జగన్ మదిలో మాత్రం ఒక్కటే రాజధాని ఉంటుందంటున్నారు. మొత్తంగా ఏపీ ప్రజలకు రాజధాని శాపం ఉందన్న మాట.. తాజా వాదన విన్నప్పుడు చటుక్కున గుర్తుకు రాక మానదు.