దీపికా పదుకొనేపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే పేరు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెపై ఓ సంచలన ఆరోపణ రావడమే ఇందుక్కారణం. ఈ ఏడాది జనవరిలో అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీలోకి దీపిక వెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో చేపట్టిన కొన్ని సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి విద్యార్థులను చితకబాదడం.. ఈ నేపథ్యంలో దీపిక ధైర్యంగా జేఎన్యూకు వెళ్లి వారికి సంఘీభావం పలకడం చర్చనీయాంశమైంది. తన కొత్త చిత్రం ‘చపాక్’ విడుదలకు ముందు పబ్లిసిటీ కోసమే దీపిక జేఎన్‌యూకు వెళ్లి హడావుడి చేసిందని కొందరు విమర్శించినప్పటికీ.. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఐతే ఇప్పుడా వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జాతీయ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధికారి ఎన్కే సూద్ దీపిక మీద సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన బడా పారిశ్రామిక వేత్త అనీల్ ముసారత్ కోరిక మేరకే దీపిక జేఎన్‌యూకు వెళ్లిందని.. ఇందుకు గాను ఆమెకు రూ.5 కోట్లు ముట్టాయని ఆరోపించాడు. ఎవరో ఆషామాషీ వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. ‘రా’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన మాజీ అధికారి యూట్యూబ్ వీడియో ద్వారా ఇలా ఆరోపించడంతో దీనిపై చర్చ నడుస్తోంది. జేఎన్‌యూలో లెఫ్ట్ భావజాలంతో ఉండే చాలామంది.. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, వివిధ అంశాల్లో పాకిస్థాన్‌ను సమర్థించడం చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడి వారికి పాక్ నుంచి ఆర్థిక సహకారం అందుతూ ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపిక మీద వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.