వర్మను నమ్మకండయ్యా

Murder

కరోనా టైంలో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ అందరూ పని మానేసి ఇళ్లలో కూర్చుని ఉంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం విరామం లేకుండా సినిమాలు తీసి పారేస్తున్నాడు. నిడివి ఎంత, నాణ్యత ఎలా ఉంది అన్న విషయాలు పక్కన పెడితే.. లాక్ డౌన్ మొదలయ్యాక వర్మ ఇప్పటి వరకు మూడు సినిమాలు రిలీజ్ చేశాడు.

ఇంకో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి కరోనా మీదే తీసిన ‘కరోనా వైరస్’ కాగా.. ఇంకోటి మిర్యాల గూడలో సంచలనం రేపిన ప్రణయ్-అమృత-మారుతీరావుల ఉదంతం ఆధారంగా తెరకెక్కిన ‘మర్డర్’.

తన జీవితం ఆధారంగా సినిమా తీయడం పట్ల అమృత తీవ్ర ఆవేదన, అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వర్మ అదేమీ పట్టించుకోకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడీ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసి ట్రైలర్ కూడా రెడీ చేశాడు.

ఈ ట్రైలర్ చూసిన వాళ్లందరికీ.. ఇది మారుతీరావు చేసిన దాంట్లో తప్పేమీ లేదని, తప్పంతా అమృతదే అనే భావనే కలుగుతోంది. పిల్లల్ని ప్రేమించడం తప్పా.. తప్పు చేస్తే దండించడం తప్పా.. వేరే గతి లేనపుడు చంపించడం తప్పా అంటూ ఈ ట్రైలర్లో ప్రశ్నలు సంధించింది వర్మ టీం. దీన్ని బట్టి మారుతీ రావు చేసిందంతా రైటే అని వర్మ భావిస్తున్నాడని.. ఆ దృష్టి కోణంలోనే సినిమా తీయించాడని అంతా భావిస్తారు.

కానీ వర్మ శైలి తెలిసి కూడా ఇదే నిజమని నమ్మితే పప్పులే కాలేసినట్లే. ట్రైలర్లో ఒకటి చూపించి.. ట్రైలర్లో మరో యాంగిల్ తీసుకోవడం వర్మకు అలవాటే. ఈ మధ్యే వచ్చిన ‘పవర్ స్టార్’ సినిమా సంగతే తీసుకుంటే.. ట్రైలర్ చూసిన పవన్ ఫ్యాన్స్ అందరూ వర్మను తెగ తిట్టుకున్నారు. పవన్‌కు కించపరిచే సినిమా ఇదని.. ఆయన పరువు తీయబోతున్నాడని అనుకున్నారు.

ఐతే కొంత వరకు పవన్‌ను డీగ్రేడ్ చేసినప్పటికీ చివర్లో పవన్‌కు మంచి ఎలివేషనే ఇచ్చాడు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి.. వాటిని దిద్దుకోమనే సందేశాన్నిచ్చాడు ఈ చిత్రంలో. ‘మర్డర్’ ట్రైలర్లో తండ్రి కోణంలో సినిమా ఉండబోతున్నట్లు చూపించినా.. సినిమాలో యు టర్న్ తీసుకుని తండ్రి చేసింది తప్పని.. ఎవరిని ప్రేమించాలో, ఎవరిని పెళ్లి చేపుకోవాలో పిల్లల ఇష్టం అని వర్మ సెలవిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.