కరోనాకు స్టార్ హీరో ఛాలెంజ్

గత దశాబ్ద కాలంలో ప్రభాస్ కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సౌత్ హీరోల్లో ధనుష్ ముందుంటాడు. ముందు అతణ్ని చూసి వేరే భాషల వాళ్లు ఇతనేం హీరో అనుకున్నారు కానీ.. తన టాలెంట్ ఏంటో తెలిశాక సలాం కొట్టారు. బాలీవుడ్లో రాన్‌జానా, షమితాబ్ సినిమాలతో ధనుష్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.

తొలి సినిమా పెద్ద విజయం సాధించినా.. రెండో సినిమా నిరాశ పరచడంతో ధనుష్ మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత ధనుష్ మళ్లీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. హిందీలో ‘రాన్‌జానా’ చిత్రంతో ధనుష్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇప్పించిన ఆనంద్‌యే అతడి కొత్త చిత్రానికి దర్శకుడు. హృతిక్ రోషన్-ధనుష్-సారా అలీ ఖాన్ కలయికలో తానొక మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నట్లు ఆనంద్ ఇంతకుముందు ప్రకటించాడు.

ఐతే ఈ చిత్రంలో హృతిక్ స్థానంలోకి అక్షయ్ కుమార్ వచ్చాడు. ఈ సినిమా కరోనా విలయం సాగుతున్న ఈ సమయంలోనే సెట్స్ మీదికి వెళ్లిపోవడం విశేషం. అది కూడా ధనుష్ స్వరాష్ట్రంలోనే చిత్రీకరణ మొదలు పెట్టడం విశేషం. ధనుష్, సారాల ఆన్ లొకేషన్ పిక్ కూడా బయటికి వచ్చింది. గత హిందీ సినిమాలతో పోలిస్తే ధనుష్ స్మార్ట్‌గా, మోడర్న్‌గా ఉండే పాత్ర చేయబోతున్నాడని అతడి లుక్ చూస్తే అర్థమవుతోంది.

తమిళనాడులో చెన్నై తర్వాత పెద్ద సిటీ అయిన మధురైలో చిత్రీకరణ మొదలుపెట్టాడు ఆనంద్. దేశంలో కరోనా ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అలాంటి చోట మాస్ సిటీ అయిన మధురైలో ఈ బాలీవుడ్ మెగా మూవీ చిత్రీకరణ మొదలుపెట్టడం విశేషమే. హిందీలో అక్షయ్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి ధనుష్ నటిస్తే ఆ సినిమా అతడికెంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ సినిమాతో ధనుష్ బాలీవుడ్లో ఈసారి ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.