మార్చురీ నిండిపోయింది… కారణమే విచిత్రం

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే….తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి. అదే తరహాలో కరోనా…కరోనా…నువ్వేం చేస్తావు అంటే…కరోనా అనుమానితులు, కరోనా నుంచి కోలుకున్నవారినీ అంటరానివారిలా చూసేలా చేస్తాను…కరోనా నుంచి కోలుకున్న తల్లిదండ్రులను, తోబుట్టువులను ఇంట్లోకి రానివ్వకుండా గెంటేలా చేస్తాను…కన్నవారి కడసారి చూపులకన్నా….తన ప్రాణాలు ఎక్కువనేలా చేస్తాను….అన్నీ ఉన్నా అనాథ శవాల్లాగా అంత్యక్రియలు జరపాల్సిన దుస్థితిని….కనీసం కరోనాతో చనిపోయిన వారు తమ రక్తసంబంధీకులను చెప్పుకోకుండా బ్రతికేలా చేస్తాను…అని అంటుందేమో.

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే జనాల్లోని మానవత్వపు స్థాయిలో గణనీయంగా మార్పులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనన్న ఆవేదన పలువురిని కలచివేస్తోంది. తాజాగా, గుంటూరు జనరల్ హస్పిటల్ మార్చురీలోని దయనీయ పరిస్థితులు కరోనా వల్ల జరుగుతోన్న దారుణాలకు పరాకాష్ట అని చెప్పవచ్చు.

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలతో జీజీహెచ్ మార్చురీ నిండిపోయింది. ఆ శవాలు తమ బంధువులవేనని చెప్పేవారు కరువయ్యారు. దీంతో, ఆ శవాల ఖననం వైద్య, ఆరోగ్య, మునిసిపల్, పోలీసు సిబ్బందికి తలకు మించిన భారమైంది.

కరోనా సోకి చనిపోయిన తమ వారి మృతదేహలనే దూరంగా చూసి…అంత్యక్రియల్లో పాల్గొనలేని పరిస్థితి కొందరిది. అయితే, కరోనా సోకి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని అనాథ శవంలా మార్చురీలో వదిలేసి వెళుతున్న దారుణ మనస్తత్వం మరికొందరిది. గుంటూరు జీజీహెచ్ లో కరోనా సోకి చనిపోయిన వారు కొందరైతే….చనిపోయిన తర్వాత కరోనా అని నిర్ధారణ అయిన వారు మరికొందరు. అయితే, ఇలా చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరుస్తున్నారు.
అయితే, వాటిని తీసుకువెళ్లేందుకు రోగి వెంట వచ్చిన కుటుంబీకులు, బంధువులు ముందుకు రావడం లేదు. ఆ మృతదేహలను అనాథ శవాలుగా వదిలేసి వారి దారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో, క్రమంలో జిజిహెచ్‌ మార్చురీలో ఈ తరహాలో వదిలేసిన 40 దాకా మృతదేహలు ఉన్నాయి. ఆ మృతదేహల అంత్యక్రియలు నిర్వహిస్తేనే మార్చురీ ఖాళీ అవుతుంది.

పీపీఈ కిట్లతో మునిసిపల్ , వైద్య సిబ్బంది, కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు…వాటిని ఖననం చేయక తప్పని పరిస్థితి. అయితే, గుంటూరు కార్పొరేషన్‌లో కరోనా పాజిటివ్‌తో మృతిచెందిన వారిలో రోజుకు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. చాలా శ్మశాన వాటికల్లో స్థానికులు అభ్యంతరం తెలపడంతో…..జాప్యం జరుగుతోంది. దీంతో, ఈ విషయాన్ని గుంటూరు కలెక్టర్ దృష్టికి ఆసుపత్రి వర్గాలు తీసుకు వెళ్లాయి. వాటి ఖననంపై ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నాయి.