రావాలి జగన్…జన్మభూమికి… !! ఈ పాట వెనుక మనిషి

సాధారణంగా సినిమా పాటలు జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆయా సాహిత్యాన్ని బట్టి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతుంటారు. అదే తరహాలో పొలిటికల్ సాంగ్స్ కూడా ఓటర్లను …ఆయా పార్టీల అభిమానులను….కొన్ని సార్లు తటస్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. 2019 ఎన్నికల ప్రచారంలో రావాలి జగన్…కావాలి జగన్..మన జగన్ అన్న పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

2018లో విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన పొలిటికల్ క్యాంపెయిన్ సాంగ్ గా ఈ పాట రికార్డు క్రియేట్ చేసింది. ఫిదాచిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తిక్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రముఖ సినీ గేయ రచయిత, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ(సినీ నటుడు ఉత్తేజ్ మేనమామ) రచించారు.

అయితే, తాజాగా ఈ పాటల వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ…గతంలో టీడీపీకి కూడా పాటలు రాశారని టీడీపీ అభిమానులు ట్వీట్ చేశారు.

ఈ విషయం వైసీపీ అభిమానులకు తెలీదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ పాటకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుంచి అందుకున్న ప్రశంసల గురించి స్వయంగా సుద్దాల చెప్పిన పేపర్ కటింగ్ ను పోస్ట్ చేశారు.

1997లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జన్మభూమి కార్యక్రమం కోసం ‘తరలుదాం రండి మనం జన్మభూమికి’ అనే పాటను రాశానని, ఆరోజు వేదికపై చంద్రబాబునాయుడుగారు ప్రశంసించిన విషయాన్ని ఎప్పటికీ మరువలేనని సుద్దాల నాడు వెల్లడించారు.

ఈ రకంగా టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరిగిన వెర్బల్ వార్ వల్ల….ఈ పాటల వెనుక ఉన్న చరిత్ర తెలుసుకునే అవకాశం కలిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.