కరోనా కాదు…అనుమానం చంపేసింది

సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా మహమ్మారి ప్రమాదకరం…కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా….అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా….ఎంత ప్రచారం చేసినా…..ఎన్ని రకాలుగా చెప్పినా…కరోనా సోకిన వారిపై, కరోనా నుంచి కోలుకున్న వారిపై, కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉన్నవారిపై వివక్ష కరోనా కన్నా పది రెట్లు ప్రమాదకరం అనడంలో అస్సలు సందేహం లేదు.

మనం పోరాడాల్సింది రోగితో కాదు….వ్యాధితో అని కాలర్ ట్యూన్ లో ఊదరగొడుతోన్నా….సోషల్ మీడియా, మీడియాలో ప్రచారం జరుగుతోన్నా చాలామంది జనం తీరు మారడం లేదు. ఇప్పటికే, కరోనా సోకిందేమోనన్న అనుమానం పెనుభూతమై చాలామందిని కబళించింది. ఈ అనుమానపు పిశాచి…తాజాగా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో మరో వ్యక్తిని బలి తీసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని ముట్టుకున్నాడని పదే పదే అవహేళన చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం ముప్పులకుంట గ్రామంలో ‘కరోనా అనుమానం’ మరొకరిని పొట్టనబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం ముప్పులకుంట గ్రామంలో రామచంద్ర అనే వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. రామచంద్ర అంత్యక్రియలకు వెళ్లిన నాగన్న అనే వ్యక్తికి అప్పటి నుంచి అవహేళన మొదలైంది. రామచంద్రను నాగన్న ముట్టుకున్నాడంటూ నాగన్నను హేళన చేయడం ప్రారంభించారు గ్రామస్థులు.

తాను అంత్యక్రియల్లో పాల్గొన్నానని, కానీ, తాను రామచంద్ర మృతదేహాన్ని ముట్టుకోలేదని నాగన్న పదే పదే చెప్పినా గ్రామస్థులు వినలేదు. నాగన్న మానాన అతడిని వదిలేయకుండా….అతడిని కరోనా సోకిన వ్యక్తిలా చూస్తూ మరింత భయపెట్టి అవమానించారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నాగన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దానిని గమనించిన కుటుంబసభ్యులు పోలీసుల సాయంతో నాగన్నను అనంతపురంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే అతడు మరణించాడు. గ్రామస్థులు అవహేళన చేయడం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాగన్న భార్య కన్నీరుమున్నీరవుతోంది. ఇటువంటి వివక్షా పూరిత ఘటనలు జరగకుండా చూడాలని మిగతా గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. కరోనా బాధితులు, వారి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిపై వివక్ష చూపకూడదని మరింత ప్రచారం కల్పించాలని, అవసరమైతే వివక్ష చూపేవారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.