విలేకరుల ముందు పురుగుల మందు తాగిన వైసీపీ మహిళా నేత

విజయవాడలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విలేకరుల సమావేశం పెట్టిన ఓ మహిళా నేత.. ఆ సమావేశంలో అందరూ చూస్తుండగా పురుగుల మందు తాగి విస్మయానికి గురి చేసింది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆమె పేరు జోని కుమారి. ఆమె వైసీపీ దళిత విభాగంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బోని కుమారి జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో సభ్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె మాల మహానాడు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా. నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న వైసీపీ ఎంపీ భర్త.. తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం.

నాకు న్యాయం జరగలేదు. నాలో ఉన్న బాధను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. సీఎం వద్ద తప్ప.. నేను ఎవరి వద్దకు వెళ్లినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. చావే నా బిడ్డలకు పరిష్కార మార్గం చూపిస్తుందని జగనన్నకు చెప్పదలచుకున్నా. రాష్ట్రంలో ఉన్న దళితుల సోదరులు నా కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని జగన్మోహన్‌రెడ్డికి ఈ మెయిల్‌ ద్వారా పంపాను’ అని ముగిస్తూ.. వెంటనే బ్యాగులోని పురుగు మందు తాగేశారు. తర్వాత ఆమెను పోలీసులు ఈఎస్ఐ ఆస్పత్రికి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

సీఎంకు రాసిన లేఖలో ఇలా..?

కొన్ని నెలల క్రితం ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ భర్తతో తనకు పరిచయం జరిగిందని.. ఎస్సీ కమిషన్‌లో నామినేటెడ్‌ పోస్టు ఇప్పిస్తానని చెప్పిన ఆయన.. అందుకు రూ.13 లక్షలు ఖర్చవుతుందని చెప్పి, ముందు రూ.7 లక్షలు తీసుకున్నారని.. కానీ తర్వాత పట్టించుకోలేదని.. తన ఫోన్ తీసుకుని డబ్బు లావాదేవీలకు సంబంధించి ఆధారాలన్నీ తొలగించారని.. ఈ విషయమై ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసినా ఫలితం లేకపోయిందంటూ జోని కుమారి వాపోయింది. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసింది. ఇదే విషయమై విలేకరులు విషయం చెప్పిన అనంతరం ఆమె వారి ముందే పురుగుల మందు తాగేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా జోని కుమారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. జోని కుమారిని మోసం చేసిన ఎంపీ భర్త గురించి పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.