తిరుమల దర్శనాలపై యుటర్న్

ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గత నెల తిరుమల శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభించారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఫలితం లేకపోయింది. కొండపై పదుల సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడుతూ వచ్చారు. అధికారికంగా ఇప్పటికే 160 మంది దాకా కరోనా బాధితులుగా మారారు. కానీ అనధికారికంగా ఆ లెక్క 200 దాటిందన్నది టీటీవీ వర్గాల మాట.

ఉద్యోగులతో పాటు అర్చకులు సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే దర్శనాలు ఆపేయాలన్న డిమాండ్ మొదలైంది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. దర్శనాలు ఆపే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆయన సహా టీటీడీ బోర్డు పెద్దలంతా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.

శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే ఓ స్వామీజీ కూడా తాజాగా కరోనా బారిన పడ్డట్లు సమాచారం. ఆయన పెద్ద వయస్కుడు కావడం, అనారోగ్య సమస్యలు ఉండటంతో స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అర్చకుల్లో చాలామంది వృద్ధులే కావడంతో ఆలయంలోకి రావడానికి భయపడుతున్నారు. దర్శనాలు ఆపాలని వాళ్ల నుంచి గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.

ఉద్యోగులు సైతం పని చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. దర్శనాలు ఆపాలన్న ఒత్తిడి అంతకంతకూ పెరుగుతుండటంతో టీటీడీ ఛైర్మన్ నిర్ణయం మార్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కూడా కరోనా బారిన పడుతుండొచ్చని.. వారి నుంచి మరెంతో మందికి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుందని.. కాబట్టి దర్శనాలు ఆపాల్సిందే అని టీటీడీలో మెజారిటీ అభిప్రాయపడుతున్నారని.. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన రావచ్చని సమాచారం.