క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ రాష్ట్రం అస్సాం.

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆ రాష్ట్రంలో ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. కొంచెం లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల‌న్నీ పూర్తిగా మునిగిపోయాయి. అస‌ల‌క్క‌డ ఇళ్లు ఉన్న ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. చాలా చోట్ల దొరికిన సామాను ప‌ట్టుకుని జ‌నాలు మేడ‌ల‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చుట్టూ నీళ్లు ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్ర‌వ‌హిస్తుండ‌గా.. పైన తిన‌డానికి ఏమీ లేని దయ‌నీయ స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు.

గ‌త కొన్ని రోజుల్లో అక్క‌డ వంద మంది దాకా వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స్థాయిలో జంతువులు కూడా చ‌నిపోయాయి. భారీ ఖ‌డ్గ మృగాల‌కు నెల‌వైన అస్సాం నేష‌న‌ల్ పార్క్ కూడా వ‌ర‌ద తాకిడికి గురైంది. ఖ‌డ్గ మృగాలు కూడా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయాయి. ల‌క్ష ఎక‌రాల‌కు పైగా పంట న‌ష్టం వాటిల్లిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నిస్స‌హాయ స్థితిలో ఉండ‌గా.. ఈ ఈశాన్య రాష్ట్రం మీద చిన్న‌చూపుతో కేంద్ర ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో సాయం చేయ‌ట్లేద‌ని.. మీడియా కూడా సెల‌బ్రెటీల క‌రోనా వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డంలో బిజీగా ఉంటూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్సాం వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.