జగన్‌పై నాని ఫైర్

నాని అంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని.. ఈ ముగ్గురిలో ఒకరు కాదులెండి. ప్రతిపక్ష తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక తమ విజయవాడ అభివృద్ధిలో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందంటూ ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేశామని.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నగరం మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు.

చిన్నపాటి వర్షానికే విజయవాడ మునిగిపోతోందని కేంద్రం నుంచి నిధులు తెచ్చి పనులు మొదలుపెడితే.. ఆ పనులు కూడా సవ్యంగా జరగనివ్వట్లేదని.. స్ట్రామ్ వాటర్ డ్రైవ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు 80 కోట్ల దాకా బిల్లులు ఆపేశారని.. అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావని, కేంద్రానివని.. వాటినెందుకు ఆపుతున్నారని.. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని నాని డిమాండ్ చేశారు. జగన్, బొత్సల కమీషన్ల కోసమే ఆ నిధులు ఆపారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇచ్చేవారికే నిధులు విడుదల చేస్తూ, అలా ఇవ్వని వారికి ఆపేయడం దుర్మార్గమని నాని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి గుడిలో లింగాన్ని దోచేయడం కాదని.. స్ట్రామ్ వాటర్ డ్రైవ్ పనులు ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని అన్నారు.