ఉస్మానియాలో పీపీఈ కిట్లు వరదపాలు…వైరల్ వీడియో

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడిన ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా అదే స్థాయిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు లేవని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలోనూ వైద్యులకు సరిపడినన్ని పీపీఈ కిట్లు లేవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, అదంతా దుష్ప్రచారమని, విపక్షాలు చేస్తున్న కుట్ర అని…పీపీఈ కిట్లు సరిపడినన్ని ఉన్నాయని…ప్రభుత్వం చెబుతోంది. పీపీఈ కిట్లు ఎన్ని ఉన్నాయన్న సంగతి పక్కనబెడితే…ఉన్నన్ని పీపీఈ కిట్లను అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది…ఆయా ఆసుపత్రులది. అయితే, అసలే తక్కువగా ఉన్నాయంటోన్న పీపీఈ కిట్లు అత్యంత అవసరమైన ఈ పరిస్థితుల్లో….పదుల సంఖ్యలో పీపీీఈ కిట్లు నీటిపాలైన ఘటన హైదరాబాద్ లో చర్చనీయాంశమైంది. ఉస్మానియా ఆసుపత్రిలో వరదనీరు, డ్రైనేజీ నీరు కలిసి పొంగిపొర్లడంతో….వాటిలో పీపీఈ కిట్లు కొట్టుకుపోయాయి. ఆసుపత్రిలోని సిబ్బంది నిర్లక్ష్యంతో విలువైన పీపీఈ కిట్లు మురుగునీటిపాలవడంపై విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలో వర్షపు నీరు భారీగా చేరింది. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో కొన్ని పీపీఈ కిట్లు కొట్టుకుపోయాయి. కరోనా బాధితులు..వారికి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఇస్తున్న పీపీఈ కిట్లు వర్షానికి కొట్టుకుపోతున్న దృశ్యాలును కొందరు తమ కెమెరాలో బంధించారు. సిబ్బంది నిర్లక్ష్యంలో నీటిపాలైన పీపీఈ కిట్లంటూ… ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పీపీఈ కిట్లను భద్రపరచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఉస్మానియాలో వరదనీరు, మురుగునీరు పొంగిపొర్లడంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందేళ్ల నాటి ఆసుపత్రి కావడంతో.. బిల్డింగ్‌ పెచ్చులు కూడా ఊడిపడుతున్నాయి.

ఎగువ ప్రాంతాల నుంచి పారుతున్న వర్షపు నీరు….దానితో కలిసిన డ్రైనేజీ నేరుగా ఆసుపత్రిలోకి ప్రవహించడంతో…ఆసుపత్రిలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. బెడ్లు కూడా చాలా వరకు తడిసి ముద్దయ్యాయి. నీళ్లు బయటకు పోవడం కష్టతరంగా మారడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మరోవైపు, వర్షం కారణంగా రోగులకు వైద్యసేవలు కూడా నిలిచిపోయాయి. ఓ వైపు కరోనా భయం…మరోవైపు సీజనల్‌ వ్యాదులు…ఇంకోవైపు డ్రైనేజీనీటితో కలిసిన వర్షపు నీరు…దీంతో, రోగుల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రభుత్వం స్పందించి వర్షపు, డ్రైనేజీ నీరు ఉస్మానియాలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రోగులు, వైద్య సిబ్బంది కోరుతున్నారు.