వైసీపీకి ఢిల్లీ హైకోర్టు షాక్..ఎందుకంటే

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీగా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని మహబూబ్ బాషా కోరడం చర్చనీయాంశమైంది.

దీంతోపాటు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ తో పాటు వైసీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.

వైఎస్సార్ అనే పదంతో చాలా ఏళ్ల క్రితం నమోదైన ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా చెబుతున్నారు. వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

అయితే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అని రాయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన హింట్ తో మహబూబ్ బాషాకు మరింత దన్ను లభించినట్లయింది. అందుకే, మొదట ఈసీకి ఫిర్యాదు చేసిన మహబూబ్….ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఐడియాతో..చాలామందికి పరిచయం లేని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రపంచానికి తెలిసింది.

ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా పేరు…ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తనకు ఇచ్చిన షోకాజు నోటీసురే రఘురామ కృష్ణం రాజు జవాబివ్వడం వల్లే ఈ గొడవ తెరపైకి వచ్చిందని, లేకుంటే ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.