27 వేల క‌రోనా శాంపిల్స్ ప‌నికిరాకుండా పోయాయ్

క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుపుతున్న‌ సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది. తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌నాల నుంచి సేక‌రించి 27 వేల శాంపిల్స్ ప‌నికి రాకుండా పోయాయి. ఈ ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విష‌య‌మై ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్ పోలా భాస్క‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు.

అనుమానిత లక్షణాలున్న వారి నుంచి నమూనాల సేకరించే క్ర‌మంలో క్షేత్ర స్థాయిలో పొరపాట్లు దొర్లుతున్నాయని.. సేకరించిన వాటికి ఐడీ నంబర్లు వేయడం లేదని.. మూత లేకుండానే కొన్నింటిని ల్యాబ్‌లకు పంపిస్తున్నారని.. దీంతో టెస్టింగ్‌ కేంద్రాల్లో నమూనాలు పక్కన పెడుతున్నారని.. ఇలా జిల్లాలో 27 వేల శాంపిల్స్ వృథా అయ్యాయ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

\క‌రోనా శాంపిల్స్ సేక‌ర‌ణ‌, మెయింటైనెన్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల ల్యాబ్‌ సిబ్బంది ఒకరు మరణించిన‌ట్లు కూడా క‌లెక్ట‌ర్‌ వెల్ల‌డించారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదంటూ ఆయ‌న మీడియాకు కూడా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే ప్రకాశం మాదిరిగానే ఏపీలోని పలు జిల్లాల్లోనూ అనుమానితుల నుంచి సేక‌రించిన శాంపిల్స్ ప‌రీక్ష‌ల‌కు నోచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

సుమారు పది జిల్లాలలో ఒక్కోచోట 4 నుంచి 5 వేల వరకు నమూనాలను పరీక్షించకుండానే వదిలేశారన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఏపీలో ఒక్కో నిర్ధారణ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 వరకు ఖ‌ర్చు చేస్తోంది. సేకరించిన నమూనాలు నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌లకు వెళ్తున్నాయా.. వివరాల నమోదు సక్రమంగా ఉందా.. సకాలంలో ఫలితాలు వస్తున్నాయా.. అన్న‌దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.