ఎన్ కౌంటర్ పై గ్యాంగ్ స్టర్ భార్య రియాక్షన్ ఏమంటే?

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఉదంతంలో.. ఎన్ కౌంటర్ లో అతగాడు బలి కావటం తెలిసిందే. అందరి అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా సాగిన ఎన్ కౌంటర్ పై ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గ్యాంగ్ స్టర్ సతీమణి రిచా దూబే సైతం ఆ తరహాలోనే వ్యాఖ్యలు చేయటం విశేషం. పోలీసులపై మరణకాండకు పాల్పడ్డ వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె వ్యాఖ్యానించారు.

ఎన్ కౌంటర్ లో మరణించిన వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూరులోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిచాతోపాటు.. ఆమె కుమారుడు.. తమ్ముడు తదితరులు హాజరయ్యారు. దుబే డెడ్ బాడీని ఎలక్ట్రిక్ క్రిమేషన్ మెషీన్ లో ఉంచి అంత్యక్రియల్ని నిర్వహించారు.

ఎన్ కౌంటర్ మీద స్పందించాలన్న రిపోర్టర్ల ప్రశ్నలకు స్పందించిన ఆమె.. వికాస్ చాలా పెద్ద తప్పు చేశాడని.. అతనికి ఇలాంటి చావు రాసి పెట్టి ఉందన్నారు.

అదే సమయంలో.. తనను ప్రశ్నలు వేస్తున్న మీడియా ప్రతినిధులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీవల్లే వికాస్ కు ఈ గతి పట్టింది.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నారు. రిపోర్టర్లపై రుసరుస లాడిన రిచా దూబే.. అందుకు భిన్నంగా ఎన్ కౌంటర్ మీద మాత్రం ఒక్క నెగిటివ్ వ్యాఖ్య కూడా చేయకపోవటం గమనార్హం.

గ్యాంగస్టర్ వికాస్ దూబేను గత వారంలో అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటం.. ఆక్రమంలో డీఎస్పీ స్థాయి అధికారి మొదలు మొత్తం 8 మంది పోలీసుల్ని కాల్చి చంపాడు.

అనంతరం పారిపోయిన అతడ్ని.. అతడి అనుచర వర్గాన్ని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేయటం తెలిసిందే. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో వికాస్ దూబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్కడి నుంచి కాన్పూరుకు అతన్ని తరలిస్తున్న వేళ.. వారు ప్రయాణిస్తున్నవాహనం బోల్తా పడింది. దీంతో.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్యాంగ్ స్టర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.