బడ్జెట్ మీద రాజమౌళి కత్తిలాంటి కామెంట్స్

దశాబ్దం క్రితం దాకా రూ.30 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తేనే, ‘ఔరా’ అని నోరెళ్లబెట్టేవాళ్లు టాలీవుడ్ జనాలు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలుగు సినిమాల రేంజ్‌తో పాటు బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. మీడియం క్రేజ్ ఉన్న నితిన్, శర్వానంద్‌లాంటి హీరోల సినిమాలకే రూ.30 కోట్ల దాకా ఖర్చుపెడుతున్నారు నిర్మాతలు. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలైతే వాటి బడ్జెట్ మినిమం రూ.80 నుంచి రూ. 100 కోట్ల వరకూ ఉంటోంది.

‘బాహుబలి’ తర్వాత ఈ లైన్ కూడా దాటేసి సినిమాల మీద వందల కోట్లు కుమ్మరించేందుకు రెఢీ అవుతున్నారు నిర్మాతలు. ‘సాహో’, ‘సైరా’,‘2.0’ సినిమాలు ఇలాంటి భారీ బడ్జెట్‌‌తో రూపొందినవే. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ఫ’, ‘ఆచార్య’ సినిమాల బడ్జెట్ కూడా వంద కోట్ల మార్క్ దాటింది. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించే సినిమాల వల్ల నిర్మాతలకు పెద్దగా లాభాలు రాకపోగా, రిజల్ట్ కాస్త తేడా కొట్టినా డిస్టిబ్యూటర్లు కోట్లలో నష్టాలను చూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌ గురించి చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో డిస్కర్షన్ జరుగుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి దీనికి ఓ అదిరే ఐడియా ఇచ్చారు. ‘సినిమాల బడ్జెట్ ఎక్కడ తగ్గాలనేది ముఖ్యం. రెమ్యూనరేషన్స్, లగ్జరీల కోసం పెట్టే డబ్బులు తగ్గించి, క్వాలిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. సినిమా రేంజ్ పెంచడం కోసం డబ్బులు పెట్టడంలో తప్పు లేదు. దాన్ని తగ్గించలేం. మిగిలిన విషయాల మీద పెట్టే ఖర్చు తగ్గిస్తే బడ్జెట్ కంట్రోల్ చేయవచ్చు’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  

ఇప్పుడు మన స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల దాకా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు.  ‘బాహుబలి’ కోసం ప్రభాస్, ‘సైరా’ కోసం చిరంజీవికి రెమ్యూనరేషన్ రూపంలోనే భారీగా దక్కింది. ప్రభాస్ తన తర్వాతి సినిమా కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వస్తుండగా, ‘ఆర్ఆర్ఆర్’ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు భారీగానే ముట్టజెప్పుతున్నట్టు టాక్. ఇదీగాక అనవసరంగా ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్స్ చేయడం, ఎక్కువరోజులు షూటింగ్ సాగదీయడం వల్ల బడ్జెట్ మరింత పెరిగిపోతోంది. ఇదిగాక లగ్జరీల కోసం పెట్టే ఖర్చు మరో ఎక్స్‌ట్రా. బడ్జెట్‌లో వీటికోసమే 40 శాతం దాకా ఖర్చు అవుతోందని ఫిల్మ్ నగర్ టాక్.

పైన చెప్పినవన్నీ కట్ చేస్తే బడ్జెట్‌ని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా తమ సినిమాకు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, అంత గొప్ప… అంత ఎక్కువ పబ్లిసిటీ, బిజినెస్ అవుతుందనే మాయలోనుంచి హీరోలు, దర్శకనిర్మాతలు బయటికి రావాలంటున్నారు విశ్లేషకులు.