చ‌ర‌ణ్‌ను మెప్పించిన ఉప్పెన ద‌ర్శ‌కుడు?

Ram Charan

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌కు త‌న శిష్యుల్ని వృద్ధిలోకి తేవాల‌ని మ‌హా త‌ప‌న‌. త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్లుగా ప‌ని చేసిన అంద‌రినీ ద‌ర్శ‌కులు అవ్వాల‌ని ఆయ‌న గ‌ట్టిగా కోరుకుంటార‌ని స‌న్నిహితులు చెబుతారు. ఇప్ప‌టికే సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌కుడ‌య్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. దీని త‌ర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.

అలాగే సుకుమార్ స్నేహితులు, అత‌డి సినిమాల‌కు ప‌ని చేసిన‌ హ‌రిప్ర‌సాద్ జ‌క్కా, వేమారెడ్డి సైతం ద‌ర్శ‌కులుగా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఈ వ‌రుస‌లో బుచ్చిబాబు సానా కూడా ద‌ర్శ‌కుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒక‌డైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఐతే లాక్ డౌన్ వ‌ల్ల ఉప్పెన ఆల‌స్య‌మైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విష‌యంలో బుచ్చిబాబు చాలా ఫీల‌వుతున్న‌ప్ప‌టికీ.. అత‌డికి ఉప‌శ‌మ‌నాన్నిచ్చే ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో సినిమా చేయ‌డానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓకే అన్న‌ట్లు తెలిసింది.

ఒక పెద్ద స్థాయి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను త‌యారు చేసుకెళ్లి సుకుమార్ రెక‌మండేష‌న్‌తో చ‌ర‌ణ్‌ను క‌లిసి అత‌డికి క‌థ చెప్ప‌గా.. చ‌ర‌ణ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఇప్ప‌టికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చ‌ర‌ణ్‌.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ట‌. సుకుమార్ కూడా త‌న శిష్యుడి గురించి భ‌రోసా ఇవ్వ‌డం, అవ‌స‌ర‌మైతే స్క్రిప్టు, మేకింగ్‌లో త‌న స‌హకారం ఉంటుంద‌ని హామీ ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ భవిష్య‌త్తులో బుచ్చిబాబుతో ప‌ని చేయ‌డానికి ఓకే అన్న‌ట్లు స‌మాచారం.