గుండెలు పిండేలా తెలుగు రాష్ట్రాల్లో ఆ 5 మరణాలు

ఒక రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే మరణాలు చాలానే ఉంటాయి. కానీ.. శుక్రవారం చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. తదనంతర పరిణామాల గురించి తెలిస్తే గుండెలు పిండేసినట్లు కావటమే కాదు.. భయంతో నోట మాట రాదన్నట్లుగా పరిస్థితి ఉంది. మాయదారి రోగం ఏమో కానీ.. మనుషుల్ని కబళించేస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

  1. కరోనా ఉందో లేదో తెలీదు. కానీ.. ఆ అనుమానంతో మనిషి చనిపోయేలా చేసిన వైనం తెలిస్తే గుండెలు అదరాల్సిందే. గోదావరిఖనికి చెందిన హరిప్రియ ఎనిమిది నెలల గర్భవతి. ఆమెకు రెండు రోజుల క్రితం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళితే.. గర్భంలోపల బిడ్డ మరణించినట్లుగుర్తించి.. పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో.. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. ఆమెకు కరోనా ఉందన్న అనుమానంతో ఆమెకు టెస్టు చేశారు. రిజల్ట్ వచ్చే వరకూ ఆపరేషన్ చేయమని చెప్పారు. దీంతో.. పన్నెండు గంటల పాటు నొప్పులతో విలవిలలాడిన ఆమె చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపిస్తుండగా.. కరోనా ఫలితం రాకుండే తామేం చేయగలమని వైద్యులు అంటున్నారు. ఉందో లేదో తెలీని కరోనా కోసం.. బతికున్న మనిషిని బలి పెట్టటం ఎంతవరకు సరి? పన్నెండు గంటల పాటు కడుపునొప్పితో విలవిలలాడటానికి మించిన నరకం ఏముంటుంది?
  2. ఆమె వయసు 58 ఏళ్లు. హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఆమెకు ఘగర్ ఉంది. ఈ నెలాఖరులో రిటైర్మెంట్. తన వయసు నేపథ్యంలో తనకు డ్యూటీ వేయొద్దని వేడుకొంది. కానీ.. అందుకు నో చెప్పి విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చారు. పదిహేను రోజుల క్రితం జ్వరం కారణంగా సెలవు పెట్టారు. ఎంతకూ తగ్గకపోవటంతో పరీక్ష చేయిస్తే పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే తాను విధులు నిర్వహించే ఛాతీ ఆసుపత్రిలో పేషెంట్ గా చేరారు. పరిస్థితి విషమించటంతో ఆమెను 19న గాంధీకి తరలించారు. చికిత్స పొందుతున్నా.. వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఆమె శుక్రవారం మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా హెడ్ నర్సు మరణించటం ఇదే తొలిసారి. ఆమెకు డ్యూటీ వేయకుంటే మరణించేది కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే.. ఆసుపత్రి ఉన్నతాధికారులు మాత్రం పదిహేను రోజుల నుంచి సెలవులో ఉంటే తమది కారణం ఏమిటన్న వాదనకు దిగుతున్నారు. సెలవుకు పదిహేను రోజుల ముందు విధులు నిర్వర్తించటం.. అది కూడా కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇచ్చే ఆసుపత్రిలో అంటే ఇంకేమనాలి?
  3. ఈ ఉదంతం వింటే.. వైరస్ భయం మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుందా? అన్న సందేహం రాక మానదు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో 75 ఏళ్ల పెద్ద వయస్కుడకి మహమ్మారి రోగ లక్షణాలు కనిపించాయి. శాంపిల్స్ సేకరించారు. పాజిటివ్ గా తేలింది. శుక్రవారం మరణించాడు. దీంతో.. దహన సంస్కారాల కోసం ప్రభుత్వ సిబ్బంది సాయం కోసం అడిగితే.. పని చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో.. నలుగురికి ఆ బాధ్యత అప్పజెప్పారు. ఆ భౌతికకాయం బరువుగా ఉండటంతో జేసీబీ (ఎక్స్కవేటర్) తీసుకొచ్చి.. అందులోనే శ్మశాననికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇంత దారుణంగా అంత్యక్రియలు చేస్తారా? అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంబంధిత శానిటరీఇన్ స్పెక్టర్ అధికారిని సస్పెండ్ చేశారు.
  4. మహమ్మారి లక్షణాలు కనిపించాయంటే చాలు.. వారికి వైద్యం చేయటానికి వణుకుతున్నారు. లక్షణాలు సాధారణంగా ఉంటే వైద్యం చేసి ఇంటికి పంపుతున్నారు. అదే.. ఏదైనా ఇతరత్రా సమస్యలు ఉన్నాయంటే.. వారికి వైద్యం చేసేందుకుఆలస్యం చేస్తున్నారు. అలా చేస్తున్న ఆలస్యం ఖరీదు.. ఏకంగా ఒక ప్రాణం అవుతోంది. హైదరాబాద్ శివారు దమ్మాయిగూడకు చెందిన 55 ఏళ్ల మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో.. ఆమెకు వైద్యం చేయించేందుకు ప్రైవేటు.. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యం చేయటానికి ఎవరికి వారు తాము చేర్చుకోమని చెప్పారు. చివరకు ఉస్మానియాకు తీసుకెళితే బెడ్లు లేవని చేతులెత్తేశారు. దీంతో.. వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులో కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ చివరకు వచ్చేసరికి కూడా ఆడ్మిట్ చేసుకోలేదు. పరిస్థితి విషమించటంతోచివరకుకింగ్ కోఠి ఆసుపత్రి సిబ్బంది ఓకే అన్నారుకానీ.. అక్కడి వార్డులో ఆక్సిజన్ అయిపోవటంతో.. చివరకు మరణించారు. చికిత్స కోసం గంటల సమయం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిరావటం.. ఎవరూ వైద్యం చేయటానికి ముందుకు రాకపోవటం చూస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఇట్టే అర్థం కాక మానదు.
  5. మణికొండకు చెందిన ఒక వ్యక్తి కరోనాతో మరణించారు. అతని దహనసంస్కారాలు చేసేందుకుమున్సిపల్ సిబ్బంది ఏకంగా 12 గంటలు తీసుకున్నారు. మాది కాదంటే మాది కాదంటూ బాధ్యత అవతల వారి మీదకు నెట్టేయటం.. చివరకుఅదే పనిగా అధికారుల్నిరిక్వెస్టు చేసిన తర్వాత గంటల కొద్దీ సమయం తర్వాత దహన సంస్కారాల్ని నిర్వహించారు. ఎందుకిలా? అంటే.. మణికొండలో ఇప్పటివరకూ మహమ్మారి కారణంగా మరణించలేదని.. అందుకే ఏర్పాట్లవిషయంలో ఆలస్యమైందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామన్నాక కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం చూస్తే.. వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయన్న దానికి ఈ ఐదు ఉదంతాలు చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి.