రాజమౌళి మొండి ధైర్యం

టాలీవుడ్ పెద్దలు కోరుకున్నట్లే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. ప్రధానంగా తెలుగు సినిమాల షూటింగులు జరిగే తెలంగాణలో అనుమతుల కోసం పలు దఫాల చర్చలు జరిగాయి. చివరికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐతే అనుమతులైతే వచ్చాయి కానీ.. టాలీవుడ్లో పెద్దగా షూటింగ్స్ హడావుడి అయితే కనిపించడం లేదు.

ప్రభుత్వం ఈ విషయంలో అనేక షరతులు విధించడం ఒక ఇబ్బంది అయితే.. హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం టాలీవుడ్‌ను వెనక్కి లాగింది. ఇలా అనుమతులివ్వడం ఆలస్యం.. అలా షూటింగ్ మొదలుపెట్టేస్తారనుకున్న వాళ్లందరూ సైలెంటుగా ఉన్నారు. ప్రభుత్వంతో చర్చలకు నాయకత్వం వహించిన చిరంజీవి.. తన ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌తో ఇండస్ట్రీలో కదలిక తెస్తారని కూడా అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను వెంటనే మొదలుపెట్టేయడానికి సన్నాహాలు చేశాడని అన్నారు. ఇందుకోసం ఒక ట్రయల్ షూట్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజాలు కావు. జక్కన్న ఎందుకు వెనక్కి తగ్గాడో అర్థం కాలేదు. కరోనా తీవ్రతే భయపెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. చాలామంది హీరోలే కరోనాకు భయపడి షూటింగులు ఇప్పుడే వద్దని నిర్మాతలకు స్పష్టం చేసినట్లు వార్తలొచ్చాయి. ఆగస్టులో కానీ చిత్రీకరణలు పున:ప్రారంభం కాకపోవచ్చని అన్నారు.

ఐతే మిగతా వాళ్ల సంగతేమో కానీ.. రాజమౌళి మాత్రం జులైలో ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ పున:ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ప్రభుత్వ షరతుల ప్రకారం షూట్ చేయడానికి ఆయన పక్కాగా ప్రణాళికలు రచించారట. ఇంకొన్ని రోజుల్లోనే ట్రయల్ షూట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దాన్ని బట్టి వచ్చే నెల రెండో వారంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను పున:ప్రారంభించాలని రాజమౌళి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.