నెపోటిజం విమర్శలపై బాలీవుడ్ ఎదురుదాడి

సినీ పరిశ్రమలో బంధుప్రీతి, వారసత్వం గురించి విమర్శలు ఎప్పుడూ ఉండేవే. స్టార్ కిడ్స్ వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతుంటారు. ఐతే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారంతో ఈ అంశంపై ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్, వాళ్లను నడిపించే వాళ్లంతా ఒక మాఫియాలా తయారై రియల్ టాలెంట్‌ను తొక్కేస్తున్నారని.. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి బిగ్ షాట్స్‌తో పాటు ఆలియా భట్, సోనమ్ కపూర్ లాంటి స్టార్ కిడ్స్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఐతే తనపై విమర్శల దాడిని తగ్గించేలా సల్మాన్.. సుశాంత్ అభిమానుల బాధను అర్థం చేసుకోవాలంటూ తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

మరోవైపు సోనాక్షి సిన్హా ఏమో.. ఈ విమర్శలు తట్టుకోలేక తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి వెళ్లిపోయింది. ఐతే విమర్శలెదుర్కొంటున్న మిగతా బ్యాచ్ మాత్రం ఇలా సాత్వికంగా ఉంటే జాన్తా నై అన్నట్లుగా వ్యవహరిస్తోంది. సోనమ్ కపూర్ రెండు రోజుల కిందట నెపోటిజం విమర్శలకు గట్టిగానే బదులిచ్చింది.

ఎవరు ఎవరికి పుట్టాలి.. ఎక్కడ ఉండాలి అన్నది ‘కర్మ’ నిర్ణయిస్తుందని.. తాను అనిల్ కపూర్‌ తనయురాలిగా ఉండటాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తానని.. దీనికి సిగ్గుపడేది లేదని వ్యాఖ్యానించింది. ఏమాత్రం టాలెంట్ లేకున్నా అనిల్ కపూర్ తనయురాలు కావడం వల్లే సోనమ్ కథానాయికగా కొనసాగగలుగుతోందన్న విమర్శలకు ఆమె ఇలా బదులిచ్చింది. ఇప్పుడేమో ఆలియా భట్ మీద వస్తున్న విమర్శలకు ఆమె తల్లి సోనీ రజ్దాన్ స్పందించింది.

బాలీవుడ్లోనే కంగనాతో పాటు కొందరు నెపోటిజం మీద తీవ్ర విమర్శలు చేస్తుండటంపై ఆమె స్పందిస్తూ.. ‘‘ఫలానా వారి కొడుకు, కూతురు అంటే ప్రేక్షకులకు చాలా అంచనాలుంటాయి. వాటిని అందుకోవడానికి చాలా కష్టపడాలి. ఈ రోజు నెపోటిజం గురించి మాట్లాడుతున్న వాళ్లు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తానంటే ఏం చేస్తారు. ఆపగలుగుతారా వారిని’’ అని ఆమె ప్రశ్నించింది. నెపోటిజంపై దాడి ఇలాగే కొనసాగితే.. స్టార్ కిడ్స్ వైపు నుంచి ఇలాంటి ఎదురుదాడి తప్పేలా లేదు.