కీర్తికి మత్తు వదిలినట్లేనా?

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ సంపాదించిన పేరు అంతా ఇంతా కాదు. దక్షిణాదిన ఒక సినిమాతో ఇంత ఫేమ్ సంపాదించిన హీరోయిన్లు చాలా అరుదు. అప్పటిదాకా ఆమె మీద ఉన్న అభిప్రాయాలు, సందేహాలు అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. జాతీయ అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యులు సైతం ఆమె ప్రదర్శనకు ముగ్ధులై ఆమెను ఉత్తమనటిగా ఎంపిక చేశారు.

ఈ సినిమాతో ఎనలేని గౌరవం సంపాదించిన కీర్తి.. అక్కడి నుంచి పాత్రల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటోంది. అప్పటికే కమిటైన పందెంకోడి-2, సామి-2 సినిమాల్లో మామూలు పాత్రలే చేసింది కానీ.. తర్వాత మాత్రం స్టార్ హీరోల సరసన రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్లకు ఆమె నో అంటూ వచ్చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎంచుకుని తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేసింది.

ఆమె ముందుకు ఇంకో రెండు మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. వాటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓ‘వైపు ఇలా హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ.. మరోవైపు ఒక్కసారిగా బరువు తగ్గిపోయి ఏదోలా తయారైంది కీర్తి. దీంతో ఓ వర్గం కీర్తి అభిమానులు ఆమె సినిమాల ఎంపిక, లుక్ విషయంలో నిరాశ చెందారు.
ఆమెను స్టార్ హీరోల సరసన, పెద్ద సినిమాల్లో చూడాలనుకున్న వారికి ఇది రుచించలేదు. రజనీకాంత్ సినిమా ఒప్పుకున్నప్పటికీ అందులో ఆమెది హీరోయిన్ పాత్ర కాదని సమాచారం. దీంతో కీర్తి ‘పెర్ఫామెన్స్’ సినిమాల మత్తులో పడిపోయిందని.. ఇక కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలే చేయదేమో అని భయపడ్డారు ఓ వర్గం ఫ్యాన్స్.

ఐతే ఇప్పుడు కీర్తి రూటు మార్చింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాను ఒప్పుకుంది. ఇది పక్కా కమర్షియల్ సినిమా అని చెప్పాల్సిన పని లేదు. ఐతే మారిన కీర్తి ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పరశురామ్ మరీ రొటీన్ క్యారెక్టర్ అయితే ఆఫర్ చేసి ఉండడనే భావిస్తున్నారు. ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే కాస్త పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యమున్న కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ చక్కగా కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్న నయనతార రూట్లో కీర్తి నడవడం మంచిదనే ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు.