బ్రేకింగ్.. తమిళనాడులో మళ్లీ లాక్ డౌన్

లాక్ డౌన్‌ను చాలా లైట్ తీసుకునే రోజులు నడుస్తున్నాయిప్పుడు. అది ఉన్నా లేకున్నా తేడా లేదు అన్నట్లే ఉంది. ఇంకెంతో కాలం జనాల్ని పట్టి ఉంచలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం దశల వారీగా మినహాయింపులు ఇస్తూ పోవడంతో ఇప్పుడు లాక్ డౌన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఐతే దేశంలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కఠిన లాక్ డౌన్‌ను అమలు చేయబోతోందంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అలా జరిగే అవకాశం లేదన్నది నిపుణుల మాట. వివిధ రాష్ట్రాలు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అదే చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్న చెన్నై, మరికొన్ని ప్రాంతాల్లో తిరిగి పూర్తి స్థాయి లాక్ డౌన్‌ పెట్టాలని నిర్ణయించింది.

చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30 వరకు కఠిన లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ జిల్లాలన్నీ చెన్నై మెట్రోపాలిటన్‌ పోలీస్ పరిధిలోనివే. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈ నాలుగు ప్రాంతాల్లో నిత్యావసర సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. ఎమర్జెన్సీలో తప్ప అద్దె క్యాబ్‌లు, ఆటో సర్వీసులకు అనుమతిలేదు. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం ఉద్యోగులతో పనిచేస్తాయి. కంటైన్‌మెంట్ జోన్‌ల పరిధిలో నివసించే ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. జూన్‌ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి. కూరగాయల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పనిచేస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయి. పార్శిల్స్‌కు మాత్రమే అనుమతి ఉటుంది. రేషన్‌, నిత్యావసర సరకుల దుకాణాలు, మొబైల్‌ షాప్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేస్తాయి. టీ దుకాణాలకు అనుమతిలేదు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాకు మినహాయింపు. అమ్మ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచన్లు యథాతథంగా పనిచేస్తాయి. ఈ 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉంటుందని సీఎం పళని స్వామి ప్రకటించారు. ఆ రెండు రోజుల్లో మాత్రం వేటికీ మినహాయింపులు ఉండబోవని స్పష్టంచేశారు. దేశంలో నమోదైన అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నిన్నటివరకు ఆ రాష్ట్రంలో 44,661 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 430మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.