బండి పాదయాత్రంతా వృధాయేనా ?

Bandi Sanjay
Bandi Sanjay

ఢిల్లీలో కేసీయార్ టూర్ ప్రోగ్రామ్ ను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు రోజుల కార్యక్రమం అంటు ఢిల్లీ వెళ్లిన కేసీయార్ ఐదు రోజులుగా ఫుల్లు బిజీగా గడిపేస్తున్నారు. అపాయింట్మెంట్ అడగటమే ఆలస్యం నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు కేసీయార్ తో భేటీ అయిపోయారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి భూమి పూజ చేయడం కోసమని వెళ్ళి తెలంగాణా భవన్ నిర్మాణానికి స్థలానికి మోదీ హామీ పొందేవరకు కేసీయార్ టూర్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తెలంగాణలో కొద్దిరోజులుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ఎందుకయ్యా అంటే కేసీయార్ పరిపాలనకు వ్యతిరేకంగా. ఏడేళ్ళ కేసీయార్ పాలనలో జనాలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి రెచ్చిపోతున్నారు. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను ఆక్రమించుకుంటామంటారు. కేసీయార్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి సీఎంను జైలుకు పంపుతానని బహిరంగంగా శపథం చేశారు.  బండి ఎక్కడ మాట్లాడినా కేసీయార్ తీట తీస్తానంటారు, తోలు తీస్తానంటారు. మొత్తం మీద పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా కేసీయార్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.

కేసీయార్ మీద బండి ఎంతటి కసి మీద ఉన్నారో జనాలందరికీ అర్ధమైపోతోంది. కానీ ఇదే కేసీయార్ మీద ఢిల్లీలోని బీజేపీ పెద్దల్లో మాత్రం మచ్చుకు కూడా ఎక్కడా వ్యతిరేకత ఉన్నట్లు కనబడటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ పార్టీకి ఢిల్లీలో సొంతంగా భవనం లేదు. ఎందుకంటే పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వ స్ధలాన్ని కేటాయించలేదు. మరలాంటిది టీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి కేసీయార్ కు ఢిల్లీలో కేంద్రం స్ధలాన్ని ఎలా కేటాయించింది ?

ఇటు మోడీ అటు కేసీయార్ మధ్య ఎంతటి సయోధ్య లేకపోతే పార్టీ నిర్మాణానికి స్థలాన్ని సంపాదించగలిగారు. ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే కేంద్రం నుండి తెలంగాణా పర్యటనకు వచ్చిన మంత్రులు కేసీయార్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను బ్రహ్మాండమంటున్నారు. అలాగే కేసీయార్ పాలనపై ఎక్కడా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఒక్క కిషన్ రెడ్డి మాత్రం కేసీయార్ పాలనపై రెచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన స్ధానికుడు కాబట్టి.

కేసీయార్ ఢిల్లీలో అడుగుపెట్టగానే రెడ్ కార్పెట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు కేసీయార్ పాలనపై నెగిటివ్ గా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా కొన్ని పథకాలను బ్రహ్మాండమని కితాబు కూడా ఇస్తున్నారు. ఆరు రోజుల టూర్లో మోడి+కేసీయార్ ఒకటే అని జనాలకు అర్ధమవుతోంది. ఇలాంటి నేపధ్యంలో కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా బండి ఎన్ని పాదయాత్రలు చేస్తే మాత్రం ఉపయోగం ఏమిటి ? అనే చర్చ పెరిగిపోతోంది. మరి దీనికి రెండు పార్టీల్లో ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.