కేంద్రంలో అలా.. రాష్ట్రంలో ఇలా.. బీజేపీ ఎందుకిలా?

ఏ రాజ‌కీయ పార్టీకైనా ఒకే విధానం ఉంటుంది. కానీ ప‌రిస్థితుల కార‌ణంగా త‌మ పద్ధ‌తుల‌ను మార్చుకుంటూ ఉంటాయి. కానీ ఒకే పార్టీ ఒక చోట ఒక‌లా.. ఇంకో చోట మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తే ఏమవుతోంది? ప్ర‌జ‌ల చేతుల్లో అభాసుపాల‌వుతోంది. ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్ర‌భుత్వం ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆ పార్టీ నాయ‌కులు మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల విష‌యంలో ఏపీలో బీజేపీ అనుస‌రిస్తున్న వ్యూహంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌నే అభిప్రాయాలు ఉన్నాయి.

దేశంలో క‌రోనా ధాటి ఇంకా పూర్తిగా త‌గ్గ‌లేద‌ని బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పండ‌గ‌లు ఉత్స‌వాల పేరుతో జ‌నాలు గుమిగూడ‌కుండా నిషేధిస్తున్న‌ట్లు ఆగ‌స్టు 28న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేయ‌డం నిమ‌జ్జ‌నం పేరుతో ఊరేగింపులు అన్నింటిపై ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ఏపీలోని జ‌గ‌న్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో బ‌హిరంగంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అక్క‌డి బీజేపీ నాయ‌కులు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు జ‌గ‌న్ నిర్ణ‌యంపై ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌స్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఉత్స‌వాల‌పై పూర్తిగా నిషేధం విధించ‌కుండా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ జ‌రుపుకోవాల‌ని ప్ర‌క‌టిస్తే బాగుండేద‌ని కానీ జ‌గ‌న్ అనాలోచిత నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వ్య‌వ‌హార శైలిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఓ వైపు పండ‌గ‌లు ఉత్స‌వాలు వ‌ద్దంటూ కేంద్రం చెప్పింది. మ‌రోవైపు కేర‌ళ‌లో బక్రీద్ ఓన‌మ్ పండ‌గ‌ల‌కు వెసులుబాట్లు ఇబ్బ‌డం కార‌ణంగానే క‌రోనా కేసులు పెరిగాయ‌ని కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు కేర‌ళ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఇప్పుడ‌దే పార్టీ నాయ‌కులు ఏపీలో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌పై ఆంక్ష‌లు ఎందుకు పెడుతున్నారంటూ నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం విచిత్రంగా ఉంది.

ఒక‌వేళ రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించే ముందు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ముందు కేంద్రాన్ని ప్ర‌శ్నించాలి. ఆ త‌ర్వాత రాష్ట్రం వైపు వేళ్లు చూపించాలి. కానీ మ‌తం పేరుతో హిందువుల మ‌ద్ద‌తు కోసం ఏపీ ప్ర‌భుత్యాన్ని ల‌క్ష్యం చేసుకోవ‌డం స‌రికాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ కూడా ఇదే మాట చెప్పారు. త‌మ రాష్ట్రంలో ఆల‌యాల‌ను పూర్తిగా తెర‌వ‌క‌పోవ‌డానికి కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలనే అనుస‌రిస్తున్నామ‌ని ఈ విష‌యంలో బీజేపీ నేత‌ల‌కు అభ్యంత‌రం ఉంటే కేంద్రంలో కొట్లాడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా అటు కేంద్రంలో ఒక‌లా.. రాష్ట్రాల్లో మ‌రొక ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్న బీజేపీపై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.